టైటిల్ రేసులో మనోళ్లు..

13 May, 2017 19:37 IST|Sakshi
టైటిల్ రేసులో మనోళ్లు..

► ప్లే ఆఫ్ లోకి హైదరాబాద్
► వార్నర్ కెప్టెన్ ఇన్నింగ్స్, రాణించిన విజయ్ శంకర్

 

కాన్పుర్: గుజరాత్ లయన్స్ పై 8 వికెట్లతో విజయం సాధించిన సన్ రైజర్స్ సగర్వంగా ప్లే ఆఫ్ బెర్త్ ను ఖాయం చేసుకుంది. మ్యాచ్ కు ముందు గెలిస్తే ప్లే ఆఫ్ కు లేకపోతే పంజాబ్ మ్యాచ్ ఫలితం పై ఆధారపడే సందిగ్థత నేలకొనగా ఎట్టకేలకు గుజరాత్ పై గెలిచి సత్తా చాటింది. ఈ విజయంతో ఢిఫెండింగ్ ఛాంపియన్ లుగా టైటిల్ రేసులో ఉన్నామని ప్రత్యర్ధులకు హెచ్చరిక జారీ చేసింది. 155 పరుగుల లక్ష్యచేదనకు బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ కు ఆదిలోనే ఎదురు దెబ్బతగిలింది. ఓపెనర్ ధావన్(18) నిరాశ పర్చగా హెన్రీక్స్ (4) కూడా వెంటనే అవుటయ్యాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన విజయ్ శంకర్ తో కెప్టెన్ వార్నర్ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నంలో నెమ్మదిగా ఆడడంతో సన్ రైజర్స్ పవర్ ప్లే ముగిసే సరికి 2 వికెట్లుకోల్పోయి 47 పరుగులే చేసింది. అంకిత్ సోని వేసిన పదో ఓవర్ మూడో బంతి వార్నర్ బ్యాట్ కు ఎడ్జ్ అయి కీపర్ దినేశ్ కార్తీక్ చేతిలో పడింది. వేంటనే కార్తీక్ పెద్దగా అప్పీల్ చేసినా అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. కానీ అది రిప్లే లో బ్యాట్ కు ఎడ్జ్ అయినట్లు స్పష్టంగా కనిపించింది. ఈ లైఫ్ అనంతరం వార్నర్ రెచ్చిపోయి ఆడాడు. 41 బంతుల్లో వార్నర్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, కొద్ది సేపటికి యవబ్యాట్స్ మన్ విజయ్ శంకర్ 35 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు.

ఇది విజయ్ శంకర్ కు ఐపీఎల్ కెరీర్ లో తొలి అర్ధ సెంచరీ, ఇక 9 ఫోర్ల తో వార్నర్ 69, 9 ఫోర్లతో విజయ్ శంకర్ 63 లతో 133 పరుగుల భాగస్వామ్యం అందించడంతో 11 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని  చేరుకోగలిగింది. చివరి బంతిని వార్నర్ ఫోర్ కొట్టి సన్ రైజర్స్ ను గెలిపించాడు. అంతకు ముందు బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ లయన్స్ యువ బౌలర్ సిరాజ్ 4 వికెట్లు తీయడంతో 154 పరుగులకే కుప్పకూలింది. గుజరాత్ బ్యాట్స్ మెన్ లో ఇషాన్ కిషాన్(61), డ్వాన్ స్మిత్(54), రవీంద్ర జడేజా (20 నాటౌట్)లు మినహా మిగతా బ్యాట్స్ మెన్ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. 4 వికెట్ల తో గుజరాత్ పతనాన్ని శాసించిన యువబౌలర్ మహ్మద్ సిరాజ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది.

మరిన్ని వార్తలు