కుర్రాళ్లు ‘ఆసియా’ను కొట్టేశారు

24 Dec, 2016 08:34 IST|Sakshi
కుర్రాళ్లు ‘ఆసియా’ను కొట్టేశారు

అండర్‌–19 ఆసియా కప్‌ క్రికెట్‌ విజేత భారత్‌
 ఫైనల్లో 34 పరుగులతో శ్రీలంక చిత్తు


కొలంబో: ఆసియా కప్‌ అండర్‌–19 క్రికెట్‌ టోర్నమెంట్‌లో భారత యువ జట్టు వరుసగా మూడోసారి విజేతగా నిలి చింది. శుక్రవారం ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్‌ 34 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ముందుగా భారత్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేయగా... ఆ తర్వాత శ్రీలంక 48.4 ఓవర్లలో 239 పరుగులకే ఆలౌటైంది. హిమాన్షు రాణా (71; 6 ఫోర్లు, 1 సిక్స్‌), శుభ్‌మన్‌ గిల్‌ (70; 4 ఫోర్లు) భారత ఇన్నింగ్స్‌లో కీలక పాత్ర పోషించగా... శ్రీలంక ఆటగాళ్లు రెవెన్‌ కెల్లీ (62; 5 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ కామిందు మెండిస్‌ (53; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. తన లెఫ్టార్మ్‌ స్పిన్‌తో కీలక వికెట్లు పడగొట్టిన భారత కెప్టెన్‌ అభిషేక్‌ శర్మ (4/37) ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలవగా... టోర్నీలో 5 మ్యాచ్‌లలో కలిపి 283 పరుగులు చేసిన హిమాన్షు రాణా ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డును గెలుచుకున్నాడు.   గెలుపు కోసం 75 బంతుల్లో 78 పరుగులు చేయాల్సిన స్థితిలో నిలిచిన శ్రీలంక, 43 పరుగుల వ్యవధితో తమ చివరి 7 వికెట్లు కోల్పోయి పరాజయంపాలైంది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు హిమాన్షు రాణా, పృథ్వీ షా (39; 6 ఫోర్లు) శుభారంభం అందించారు. ముందుగా పృథ్వీ వరుస బౌండరీలతో చెలరేగాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 67 పరుగులు, రెండో వికెట్‌కు  హిమాన్షు, శుభ్‌మన్‌ 88 పరుగులు జత చేశారు. మిడిలార్డర్‌లో కెప్టెన్‌ అభిషేక్‌ శర్మ (29), సల్మాన్‌ ఖాన్‌ (26) మరికొన్ని పరుగులు జోడించగా, కమలేశ్‌ నాగర్‌కోటి (14 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్‌) చివర్లో చెలరేగాడు.   

లక్ష్యఛేదన చేస్తూ శ్రీలంక ఆరంభంలోనే చతురంగ (13) వికెట్‌ కోల్పోయింది. అయితే  కెల్లీ, బోయగోడ (37; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రెండో వికెట్‌కు 15 ఓవర్లలోనే 78 పరుగులు జోడించడంతో ఆ జట్టు ఇన్నింగ్స్‌ చకచకా సాగింది. అయితే అభిషేక్‌ బౌలింగ్‌లో బోయగోడ అవుట్‌ కాగా ... మూడో వికెట్‌కు కెల్లీ, మెండిస్‌ 53 పరుగుల భాగస్వామ్యాన్ని కూడా అభిషేక్‌ విడదీశాడు. ఆ తర్వాత లంక కోలుకోలేకపోయింది.

మరిన్ని వార్తలు