న్యూఢిల్లీ: తనకు పైరవీలు చేసి టీమిండియా కోచ్ పదవిని సాధించడం ఎలాగో తెలియదంటూ సరికొత్త వివాదానికి తెరలేపిన మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సాధించిన రికార్డులను ప్రత్యేకంగా కొనియాడారు. ఈ క్రమంలోనే తన పేరును సచిన్ టెండూల్కర్ గా మార్చుకుందామని అనిపించిందంటూ సెహ్వాగ్ చమత్కరించారు. 'సచిన్ సాధించిన రికార్డులు అమోఘం. సచిన్ కొల్లగొట్టిన రికార్డులకు నేను ఏమాత్రం దగ్గర్లో కూడా లేను. రికార్డులు సాధించడానికి పుట్టాడు కాబట్టే.. సచిన్ ను క్రికెట్ దేవుడిగా కొనియాడబడుతున్నారు. ఈ ప్రపంచంలో గాడ్ గా పిలుపించుకునే అదృష్టాన్ని ఎవరు మాత్రం వదులుకుంటారు. నాకు కూడా గాడ్ గా పిలిపించుకోవాలనిపించింది. దాంతో నా పేరును సచిన్ గా మార్చుకుందామని అనుకున్నా'అంటూ టెండూల్కర్ పై ఉన్న అభిమానాన్ని సెహ్వాగ్ ఇలా చాటుకున్నారు.
కాగా, ప్రపంచ క్రికెట్ లో మరో సచిన్ వస్తాడని ఎప్పుడూ అనుకోలేదన్న సెహ్వాగ్.. ఆ మైండ్ సెట్ ను టీమిండియా పరుగుల మెషీన్ విరాట్ కోహ్లి మార్చేశాడన్నారు.. గతంలో సచిన్ సాధించిన రికార్డులను ప్రస్తుత క్రికెట్ లో చెలరేగిపోతున్న కోహ్లి అధిగమిస్తాడని తాను అనుకుంటున్నట్లు సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు. ఇక్కడ కోహ్లి రూపంలో మరో సచిన్ ప్రపంచానికి పరిచయం అయ్యాడని సెహ్వాగ్ పేర్కొన్నారు.