తల్లి పనిచేసే స్కూల్‌లోనే బలవన్మరణం

17 Nov, 2019 12:07 IST|Sakshi

సాక్షి, శంషాబాద్‌ రూరల్‌: తెల్లవారుజామున పాఠశాలను శుభ్రం చేయడానికి వెళ్లిన ఆమెకు తన కుమారుడు పైపునకు విగతజీవిగా వేలాడుతూ కనిపించడంతో షాక్‌కు గురైంది. ఒక్కగానొక్క కుమారుడు ఆత్మహత్యకు పాల్పడడంతో ఆమె కన్నీరుమున్నీరైంది. గతంలోనే భర్త మృతిచెందగా ఇప్పుడు కుమారుడి మృతితో ఆమె ఒంటరిగా మారింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం పాల్మాకులకు చెందిన గుడాల సువర్ణ కుమారుడు శివకుమార్‌ (24) కారు డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. తండ్రి గతంలోనే మరణించాడు. తల్లి సువర్ణ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో స్వీపర్‌గా పనిచేస్తోంది.

తల్లీకొడుకు మధ్య అప్పుడప్పుడు గొడవలు జరిగేవి. కాగా, శనివారం తెల్లవారుజామున పని కోసం పాఠశాల ఆవరణలోకి సువర్ణ వెళ్లగా కుమారుడు అక్కడ ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. పాఠశాల గది వరండాపై ఉన్న నీటి పైపునకు బట్టతో శివకుమార్‌ ఉరి వేసుకుని ఉండడం చూసి షాక్‌కు గురైంది. తన కుమారుడు ఆరి్థక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. 

తాత్కాలికంగా పాఠశాలకు తాళం 
పాఠశాల ఆవరణలో ఆత్మహత్య చేసుకోవడంతో శనివారం పాఠశాలకు తాళం వేశారు. విద్యార్థులను పక్కనే ఉన్న జిల్లా పరిషత్‌ పాఠశాలలో కూర్చోబెట్టి తరగతులు కొనసాగించారు. సంఘటన జరిగిన ప్రాథమిక పాఠశాలను శుభ్రం చేశారు.  

మరిన్ని వార్తలు