చస్తానని బెదిరించడానికే వెళ్లాడు: సురేశ్‌ భార్య

9 Nov, 2019 05:22 IST|Sakshi

తహసీల్దార్‌ హత్య కేసు నిందితుడు సురేశ్‌ భార్య లత

పెద్దఅంబర్‌పేట: తన భర్త సురేశ్‌ తహసీల్దార్‌ను హత్య చేయడానికి వెళ్లలేదని, ఆత్మహత్యాయత్నం చేసి భయపెట్టాలనుకున్నాడని.. ఈ విషయం ఆస్పత్రిలో తనతో చెప్పాడని సురేశ్‌ భార్య లత వెల్లడించింది. శుక్రవారం ఆమె గౌరెల్లిలో విలేకరులతో మాట్లాడింది. తహసీల్దార్‌కు లంచం ఇచ్చానని, మిగిలిన డబ్బులు ఇళ్లు అమ్మి ఇస్తానని ఒప్పుకున్నట్లు సురేశ్‌ తనతో చెప్పాడని వెల్లడించింది. తహసీల్దార్‌ మేడమ్‌ వినకపోవడంతోనే ఆమెను హత్య చేయాలని అనుకున్నట్లు చెప్పాడని తెలిపింది. తమ భూముల వివాదాలను అధికారులే తేల్చాలని లత వేడుకుంది. 1950 నుంచి తమ భూములను తామే సాగుచేసుకుం టున్నామని, అప్పటి నుంచి లేని సమస్యలు ఇప్పుడెందుకు వచ్చాయని సురేశ్‌ తండ్రి కృష్ణ ప్రశ్నించారు. సమస్యలన్నీ అధికారులే సృష్టించారన్నారు. తమ తండ్రి కూర వెంకయ్య పేరుతో అధికారులు గతంలోనే పట్టా పాసుపుస్తకాలు ఇచ్చారన్నారు. అయితే,  2016లో వాటిని రద్దు చేశారని తెలిపారు.

కాగా అబ్దుల్లార్‌పూర్‌మెట్‌ తహశీల్దార్‌ చెరుకూరి విజయారెడ్డిని సురేశ్‌ అనే రైతు సోమవారం సజీవ దహనం చేసిన విషయం తెలిసిందే. తన భూమికి సంబంధించి పట్టా ఇవ్వలేదనే కోపంతోనే ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించానని అతడు వాంగ్మూలం ఇచ్చాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన సురేశ్‌ కూడా ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం విదితమే.

>
మరిన్ని వార్తలు