చిన్నారి పెళ్లికూతుళ్లకు విముక్తి

21 Apr, 2016 01:53 IST|Sakshi
చిన్నారి పెళ్లికూతుళ్లకు విముక్తి

జిల్లాలో ఒక్కరోజే 18 బాల్య వివాహాల అడ్డగింత
తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ 
పలువురు బాలికలు  స్టేట్ హోంకు తరలింపు
పసితనానికి మూడు‘ముళ్లు’!

 
బడికి వెళ్లాల్సిన వయస్సులో కుటుంబ ‘బరువు బాధ్యతలు’ మోపుతున్నారు కొందరు తల్లిదండ్రులు. ఆ ‘బరువు’ను మోయలేమని తల్లిదండ్రులకు ఎదురుచెప్పలేక ఆ..చిన్నారి పెళ్లికూతుళ్లు నరకయాతన అనుభవిస్తూ పెళ్లిపీటలెక్కుతున్నారు. జిల్లాలో బుధవారం ఒక్కరోజే ఒకటికాదు..రెండు కాదు..ఏకంగా 18 బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. ఇది కేవలం సమాచారం తెలియడంతో అడ్డుకున్నవి. ఇంకా ఎవరికీ తెలియకుండా పదుల సంఖ్యలో బాల్య వివాహాలు జరిగినట్లు అంచనా. కుటుంబ ఆర్థిక పరిస్థితి, నిరక్ష్యరాస్యత కారణంగా బాల్య వివాహాలకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. బాల్య వివాహాలను అడ్డుకున్న అధికారులు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. పలువురు బాలికలను స్టేట్‌హోంకు తరలించారు.
 
 
ధన్వాడ/బాలానగర్/దౌల్తాబాద్/కొత్తకోట రూరల్: ముక్కుపచ్చలారని బాలికలకు బాల్యంలోనే కుటుంబ బాధ్యతలు అంటగడుతున్నారు. నిరక్షరాస్యత, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక అవరోధాలు.. వంటి సమస్యలు పసితనాన్ని పెళ్లిపీటలు ఎక్కిస్తున్నాయి. లేతమనసుకు తల్లిదండ్రులు వేస్తున్న ఆ మూడు‘ముళ్ల’ బం ధాన్ని అధికారులు అడ్డుకున్నారు. ఆడి పా డే వయసులో పెళ్లి‘భారం’కాకూడదని వారికి సూచించారు. బుధవారం జిల్ల్లాలో వేర్వేరు గ్రామాల్లో 18మంది బాలికల వివాహాలను ఆపివేయించారు. ధన్వాడ మండలంలోని  కిష్టాపూర్‌కు చెందిన ఓ బాలికకు చిన్నచింతకుంట మండలం పళ్లమర్రి గ్రామానికి చెందిన యువకుడితో ఈనెల 21న వివాహం చేయాలని నిశ్చయించారు. మరికల్ ఎస్‌ఐ సయ్యాద్ ఫర్హాత్ హుస్సేన్ ఇరువురి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చిబాలికను మహబూబ్‌నగర్‌లోని స్టేట్‌హోంకు తరలించారు.


బాలానగర్ మండల కేంద్రానికి చెందిన ఓ బాలికను మద్దూరు మండలం వీరారం గ్రామానికి చెందిన యువకుడికి ఇచ్చి ఈనెల 22న లగ్నం చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. పెళ్లికి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. బాలానగర్ ఎస్‌ఐ అశోక్‌కుమార్, అంగన్‌వాడీ కార్యకర్తలు అక్కడికి  చేరుకుని వివాహాన్ని అడ్డుకున్నారు. అలాగే వీరన్నపల్లి గ్రామానికి చెందిన పదో తరగతి చదువుతున్న ఓ బాలికకు కొత్తూరు మండలం చలివేంద్రంపల్లికి చెందిన ఓ యువకుడితో గురువారం వివాహం జరిపించాలని కుటుంబసభ్యులు సంబంధం కుదుర్చుకున్నారు. గ్రామస్తులు కొందరు అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ అశోక్‌కుమార్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ అండాలు కౌన్సెలింగ్ ఇచ్చి బాల్యవివాహాన్ని అడ్డుకున్నారు.


దౌల్తాబాద్ మండలంలోని బాలంపేట గ్రామానికి చెందిన పదో తరగతి పూర్తయిన ఓ బాలికకు ఈనెల 21న పెళ్లి ముహూర్తం నిశ్చయించారు. వివాహానికి ఏర్పాట్లు కూడా చేశారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, ఎస్‌ఐ రవికాంత్‌రావు, ఆర్‌ఐ సహదేవ్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ జయశ్రీ వివాహాన్ని ఆపివేయించారు.


వనపర్తి మండలం చిట్యాల గ్రామానికి చెందిన బాలికను కొత్తకోట మండలం కానాయపల్లికి చెందిన  యువకుడికి ఇచ్చి బుధవారం ఉదయం వివాహం జరిపించేందుకు  నిశ్చయించారు. బాల్యం జరుగుతుందన్న విషయాన్ని గ్రామస్తులు కొందరు అధికారులకు చెప్పడంతో వనపర్తి ఎస్‌ఐ నాగశేఖర్‌రెడ్డి, కొత్తకోట హెడ్‌కానిస్టేబుల్ జహంగీర్, ఐసీడీఎస్ అధికారిణి లక్ష్మమ్మ కానాయపల్లికి వెళ్లి పెళ్లిని అడ్డుకుని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.


కొల్లాపూర్ పట్టణంలోని ఎరుకలి గేరికి చెందిన కా లనీకి చెందిన ఓ యువకుడికి ఇదే మండలం చిన్నం బావి గ్రామానికి చెందిన బాలికతో బుధవారం వివాహం నిర్ణయించారు. అధికారులు అవగాహన కల్పించి వివాహం ఆపివేయించారు.ఇటిక్యాల మండలం కొండేరు గ్రామానికి చెందిన బాలికను బుధవారం వివాహం చేయాలని ఆమె తల్లిదండ్రులు నిశ్చయించారు. సీఐ వెంకటేశ్వర్లు గ్రామానికి చేరుకుని వివాహాన్ని అడ్డుకున్నారు.


పెద్దకొత్తపల్లి మండలంలోని ముష్టిపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడికి మరికల్‌కు చెందిన ఓ బాలికను ఇచ్చి ఈనెల 15న వివాహం జరిపించేందుకు నిర్ణయించారు. ఇదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు బాలికలకు, దేవల్‌తిర్మలాపూర్‌కు చెందిన ఓ బాలికకు ఈనెల 22న పెళ్లి చేసేందుకు ముహూర్తం ఖరారుచేశారు. ఎస్‌ఐ సైదయ్య, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ జయమణెమ్మ వారి వివాహాలను ఆపించేశారు.జిల్లాకేంద్రంలోని కుమ్మరివాడికి చెందిన బాలిక 9వ తరగతి చదువుతోంది. ఆమెకు జడ్చర్లకు చెందిన ఓ యువకుడితో బుధవారం స్థానిక ఎల్లమ్మ ఆలయంలో పెళ్లి జరిపించాలని నిర్ణయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వివాహాన్ని ఆపేసి ఇరువురి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.

మరిన్ని వార్తలు