సోనియా దీవిస్తే సీఎం అవుతా: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

25 Nov, 2023 08:49 IST|Sakshi

సాక్షి, నల్లగొండ: సోనియాగాంధీ ఆశీర్వదిస్తే ఏదో ఒకరోజు సీఎం అవుతా నని నల్లగొండ కాంగ్రెస్‌ అభ్యరి్థ, కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన శుక్రవారం నల్లగొండ నియోజకవర్గ పరిధిలోని తిప్పర్తి మండలం థానేదారుపల్లి, కంకణాలపల్లి, దుప్పలపల్లి, రాయినిగూడెం తదితర గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ కేసీఆర్‌ పాలన లో తెలంగాణ ఆగమైందన్నారు.

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆయనను వ్యతిరేకిస్తున్నార ని చెప్పారు. 15 రోజుల్లో కేసీఆర్‌ను ప్రగతి భవ న్‌ నుంచి బయటకు పంపే పరిస్థితి రాబోతుందని జోస్యం చెప్పారు. ఉద్యోగాల భర్తీ కోసం పోటీ పరీక్షలు నిర్వహించడంలోనూ ప్రభుత్వం విఫలం కావడం వల్లే నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆకాంక్ష మేరకు సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే.. రాష్ట్రాన్ని కేసీఆర్‌ అప్పుల ఊబిలో పడేశారని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు.  

తెలంగాణను కాపాడేది కాంగ్రెస్సే 
తెలంగాణలో బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎంలనుంచి ప్రజల ను కాపాడేది కాంగ్రెస్‌ పార్టీనేనని, ఆరు గ్యారంటీ స్కీంలను ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీకే రాష్ట్ర ప్రజలు ఓటు వేయాలని సీడబ్ల్యూసీ సభ్యురాలు ఆల్కాలాంబా పిలుపునిచ్చారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ...తెలంగాణ తో పాటు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడోయాత్ర తర్వాత ప్రజల్లో ఆలోచన పెరిగిందని, అందుకే కర్ణాటకలోని డబుల్‌ఇంజన్‌ సర్కారును ఓడించి అక్కడి ప్రజలు కాంగ్రెస్‌ పారీ్టకి పట్టం కట్టారని చెప్పారు. బీజేపీ నేతలు దేశాన్ని విడిచిపెట్టి తెలంగాణలో ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చారని, కశ్మీర్‌లో ఐదుగురు జవాన్లు చనిపోతే వెళ్లకుండా అమిత్‌షా తెలంగాణకు వచ్చి బీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని, తమను గెలిపించడం ద్వారానే సమగ్రాభివృద్ధి జరుగుతుందని అల్కాలాంబా చెప్పారు.  

మరిన్ని వార్తలు