నన్ను కాదంటే...నేనూరుకుంటానా

6 Dec, 2015 10:10 IST|Sakshi
నన్ను కాదంటే...నేనూరుకుంటానా

నా నియోజకవర్గంలో నాకు చెప్పకుండా కాంగ్రెస్ నేత తమ్ముడిని పార్టీలో చేర్చుకుంటే నేనూరుకుంటానా అందుకే కిషన్‌రెడ్డిని తొలగించాలని డిమాండ్ చేశానని చెప్పుకొచ్చాడు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. రాజధానికి చెందిన ఈ బీజేపీ ఎమ్మెల్యే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డిని తొలగించి సహచర ఎమ్మెల్యేలు ఇద్దరిలో ఒకరిని అధ్యక్షుడిని చేయాలంటూ ఏకంగా ప్రెస్‌మీట్ పెట్టేశాడు. మామూలుగా బీజేపీలో ఇలాంటి డిమాండ్లు ఉండవు. విషయం తెలుసుకుని మాజీ అధ్యక్షుడు ఒకాయన రాజా సింగ్‌కు ఫోన్ చేసి ఇలా మాట్లాడటం మంచిది కాదు కదా అంటే... మీ నియోజకవర్గంలో మీకు తెలియకుండా కాంగ్రెస్ నేతను చేర్చుకుంటే మీరు మాట్లాడకుండా ఉంటారా అని ఎదురు ప్రశ్నించారు.

మాజీ మంత్రి సోదరుడు అయిన మాజీ కాంగ్రెస్ కార్పొరేటర్‌ను చేర్చుకున్నాడని, నియోజవకర్గంలో తనకు తెలియకుండా కార్యక్రమాలు పెడుతున్నారని వాపోయారు. అంతదానికి మీడియా ముందుకు వెళ్లకుండా పార్టీ వేదికపై చర్చిస్తే బాగుండేదని అంటే... ఈ పార్టీ కాకపోతే ఇంకో పార్టీ నేను సహించనంతే...అని ఫోన్ కట్ చేశాడట సదరు ఎమ్మెల్యే.

మరిన్ని వార్తలు