న్యూఢిల్లీ: కొత్త బ్యాంకులకు లెసైన్స్ల జారీ ప్రక్రియ మొదలవనుంది. దరఖాస్తుల పరిశీలన కోసం త్వరలో ఉన్నతస్థాయి సలహా కమిటీ(హెచ్ఎల్ఏసీ)ని ఆర్బీఐ నియమించనుంది. బ్యాంకింగ్ లెసైన్స్ల కోసం 26 కార్పొరేట్, ప్రభుత్వ రంగ కంపెనీలు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.
కాగా, కమిటీలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగానికి చెందిన ప్రముఖ విశ్లేషకులు, నిపుణులు ఉంటారని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఆర్బీఐ నుంచి సభ్యులెవరూ దీనిలో ఉండరని సమాచారం. ప్రభుత్వం తరఫునుంచి కూడా కొందరు ఉన్నతాధికారులకు కమిటీలో స్థానం కల్పించే అవకాశం ఉంది. వచ్చే మార్చిలోగా లెసైన్స్ల జారీకి అవకాశం ఉందని ఆర్బీఐ, ప్రభుత్వం చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే.