గెలాక్సీ నోట్7 షిప్మెంట్లకు షాక్

1 Sep, 2016 11:03 IST|Sakshi
గెలాక్సీ నోట్7 షిప్మెంట్లకు షాక్
సియోల్ : ఓ వైపు గెలాక్సీ నోట్ 7 సప్లైను మించి డిమాండ్లో దూసుకెళ్తుండగా... మరోవైపు ఆ డివైజ్ల సరుకు రవాణా ఆలస్యం కానుందట. ప్రీమియం డివైజ్ల్లో అదనంగా నాణ్యతా నియంత్రణ పరీక్షలు చేపట్టనున్న నేపథ్యంలో గెలాక్సీ నోట్ 7 డివైజ్ల సరుకు రవాణాను జాప్యం చేయనున్నట్టు టెక్ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ వెల్లడించింది. దక్షిణ కొరియాకు చెందిన టాప్-3 క్యారియర్స్(డివైజ్లను రవాణా చేసే సంస్థలు) ఎస్కే టెలికాం కంపెనీ లిమిటెడ్, కేటీ కార్పొ, ఎల్జీ అప్లస్ కార్పొలకు పూర్తిగా సరుకు రవాణా నిలిపివేసినట్టు తెలిపింది. ఉత్పత్తి నాణ్యతలో మరిన్ని పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలోనే గెలాక్సీ నోట్7ల సరుకు రవాణాను ఆలస్యం చేస్తున్నామని రాయిటర్స్కు పంపిన ఓ ప్రకటనలో శాంసంగ్ పేర్కొంది. అయితే ఫోన్లో లోపాలను శాంసంగ్ వెల్లడించలేదు. 
 
గెలాక్సీ నోట్7 ఫోన్ కస్టమర్ల నుంచి శాంసంగ్కు భారీగానే ఫిర్యాదులు వెళ్లాయట. ఫోన్కు చార్జింగ్ పెడుతున్న సమయంలో పేలుడు ఘటనలు సంభవిస్తున్నాయని కస్టమర్ల ఫిర్యాదులు చేశారని దక్షిణ కొరియా రిపోర్టులు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో శాంసంగ్ గెలాక్సీ నోట్7 క్వాలిటీ కంట్రోల్లో అదనంగా పరీక్షలు నిర్వహించాలని కంపెనీ భావించిందని రిపోర్టులు వెల్లడించాయి. గతేడాది కూడా గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ ఫోన్ను వినియోగదారులు ఆశించిన మేర సప్లై చేయక అమ్మకాల్లో నిరాశపరిచింది. మరోవైపు శాంసంగ్ పోటీ సంస్థ యాపిల్ వచ్చే వారంలోనే తన కొత్త ఫోన్లను ఆవిష్కరించనున్న నేపథ్యంలో సరుకురవాణా జాప్యం చేయడం అంతమంచిది కాదని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ నోట్7లో లోపాలను వెంటనే సవరించుకోవాలని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. మరోవైపు గెలాక్సీ నోట్7 డివైజ్లు సరుకు రవాణా ఆలస్యం కానున్నట్టు వార్త బయటికి పొక్కగానే ఆ కంపెనీ షేర్లు ఢమాల్ మనిపించాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఈ కంపెనీ షేర్లు రెండు వారాల కనిష్టంలో నమోదయ్యాయి. 
మరిన్ని వార్తలు