అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు ఆక్షేపణీయం

18 Sep, 2021 07:25 IST|Sakshi

ఐపీఎస్‌ అధికారుల సంఘం 

సాక్షి, అమరావతి:  టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మాజీ మంత్రి అయి ఉండి కూడా ‘ఎస్పీ నా కొడుకులు’ అని సంబోధించడం ఆక్షేపణీయమని ఆంధ్రప్రదేశ్‌ ఐపీఎస్‌ అధికారుల సంఘం కార్యదర్శి సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయనొక ప్రకటన చేస్తూ.. వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయన వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయని తెలిపారు. ప్రజా ప్రతినిధులు హుందాతనంతో, విలువలతో, స్థాయికి తగ్గట్టు వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

రాజకీయ విశృంఖలత్వం మితిమీరక ముందే ఇటువంటి ప్రవర్తనను సభ్య సమాజం గర్హించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నో సమస్యల మధ్య విధులు నిర్వర్తిస్తున్న ఐపీఎస్‌ అధికారుల పట్ల అనుచితంగా వ్యవహరించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఒక పోలీసు ఉన్నతాధికారిని దూషించడమంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. ఇష్టానుసారం మాట్లాడి వ్యవస్థలను అభాసుపాలు చేయొద్దని హితవు పలికారు.  

మరిన్ని వార్తలు