సాక్షి, విశాఖపట్నం: దక్షిణ అండమాన్ సముద్రానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో బుధవారం మధ్యాహ్నం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ దిశగా పయనిస్తూ గురువారం నాటికి తీవ్ర అల్పపీడనంగా మారనుంది. అదే తీవ్రతతో, అదే దిశగా 17వ తేదీ ఉదయం వరకు కొనసాగుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం రాత్రి నివేదికలో తెలిపింది.
మరోవైపు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆపై మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని తెలిపింది. కాగా బుధవారం తూర్పు గోదావరి జిల్లా పోతవరంలో 4.1, అల్లూరి సీతారామరాజు జిల్లా కుంతలంలో 2.5 సెం.మీల వర్షపాతం నమోదైంది.
చదవండి: (రాష్ట్రానికి విశాఖే భవిష్యత్.. త్వరలోనే వైజాగ్ నుంచి పరిపాలన)