గది ఖాళీ చేయమంటే.. చంపుతామంటున్నారు

22 Nov, 2022 08:11 IST|Sakshi

సాక్షి, అనంతపురం: అనంతపురం నగరంలోని నందినీ హోటల్‌ ఎదురుగా ఉన్న జేసీ ట్రావెల్స్‌ గదిని ఖాళీ చేయకుండా తమను తాడిపత్రి మునిసిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకరరెడ్డి బెదిరిస్తున్నారని మల్లికార్జున ఆచారి దంపతులు ఎస్పీ ఫక్కీరప్పను కలిసి కన్నీరు మున్నీరయ్యారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో నిర్వహించిన స్పందన గ్రీవెన్స్‌కు హాజరైన వారు తమ ఆవేదనను ఎస్పీకి విన్నవించుకున్నారు.

గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి పిటీషన్లు స్వీకరిస్తున్న ఎస్పీ   

తమ షాపును 2000లో బాబాయ్య అనే వ్యక్తికి బాడుగకు ఇచ్చామని, అయితే తమ నుంచి అద్దెకు తీసుకొని అతను షాపును తాడిపత్రి జేసీ ట్రావెల్స్‌కు అద్దెకు ఇచ్చాడన్నారు. ఇప్పుడు వారిద్దరు కుమ్మక్కై నాకు బాడుగ ఇవ్వకుండా ఖాళీ చేయకుండా వేధిస్తున్నారని తెలిపారు. నేరుగా జేసీ ప్రభాకర్‌రెడ్డిని కలిశామని, స్పందించాల్సిన పెద్దమనిషి బెదిరించారన్నారు. షాపు పగల గొడతా, మర్డర్‌ చేస్తానన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని వేడుకున్నారు. స్థానిక కమలానగరులో ఇండిపెండెంట్‌ బిజినెస్‌ కన్సల్టర్‌ సెంటర్‌ (ఐబీసీసీ) పేరుతో పేద విద్యార్థులకు డబ్బు ఆశ చూపి మోసం చేస్తున్న నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐక్య విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు.

వైఎస్సార్‌ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మతి హనుమంతురెడ్డి, ఏపీఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు ఆకుల రాఘవేంద్ర, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సూర్యచంద్ర.. ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మొత్తం 97 మంది నుంచి ఎస్పీ పిటీషన్లు స్వీకరించారు. అనంతం ఎస్పీ మాట్లాడుతూ ఆస్తులు కాజేయడం, కబ్జాలకు తెగబడటం, డబ్బు ఆశ చూసి చీటింగ్‌కు పాల్పడటం వంటి మోసాలకు పాల్పడివారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. అలాంటి వంచకులపై ఫిర్యాదులు అందితే తాట తీస్తామని హెచ్చరించారు. 

చదవండి: (మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్‌.. ఒకేసారి 50 బృందాలతో..) 

మరిన్ని వార్తలు