ఈవీ రంగంలోకి ప్రముఖ ల్యాప్‌టాప్‌ కంపెనీ.. తొలి ఈ-స్కూటర్‌ విడుదల

16 Oct, 2023 15:45 IST|Sakshi

తైవాన్‌కు చెందిన ప్రముఖ హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఏసర్ (Acer) ఎలక్ట్రిక్‌ వాహనాల రంగంలోకి అడుగు పెట్టింది. భారతీయ మార్కెట్లో తన మొదటి ఈ-స్కూటర్‌ను విడుదల చేసింది. MUVI 125 4G పేరుతో తీసుకొచ్చిన ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ధర రూ. 99,999 (ఎక్స్-షోరూమ్).

ఈ MUVI 125 4G ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూపొందించింది, తయారు చేసింది ముంబైకి చెందిన ఈవీ స్టార్టప్ థింక్ ఈబైక్‌గో. ఎలక్ట్రిక్‌ వాహన రంగంలోకి ఏసర్‌ అడుగుపెట్టడంతో ఇప్పటికే ఆ రంగంలో ఉన్న ఓలా, ఏథర్‌ వంటి కంపెనీలకు గట్టిపోటీ ఎదురుకానుంది.

MUVI 125 4G ప్రత్యేకతలు

  • ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్‌ 80 కిలోమీటర్లు
  • గరిష్ట వేగం 75 kmph.
  • ఛార్జింగ్ కోసం స్వాప్ చేయగల బ్యాటరీ
  • తేలికపాటి ఛాసిస్
  • 16-అంగుళాల చక్రాలు, కాంపాక్ట్‌ డిజైన్
  • డబుల్‌ డిస్క్‌ బ్రేక్స్‌

MUVI 125 4G సాంకేతిక వివరాలను మాత్రం ఏసర్ వెల్లడించలేదు. అయితే, ఇది మార్చుకోదగిన (స్వాపింగ్‌) బ్యాటరీలతో వస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీలకు అర్హత పొందుతుందని కంపెనీ ధ్రువీకరించింది. ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌కు ప్రీ-బుకింగ్‌లు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రీ-బుకింగ్‌లు, డీలర్‌షిప్‌పై ఆసక్తి ఉన్నవారు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

మరిన్ని వార్తలు