పిజ్జా ప్రియులకు శుభవార్త.. సగానికి తగ్గిన ధరలు - కారణం ఇదే!

5 Oct, 2023 18:50 IST|Sakshi

ఆధునిక కాలంలో పిజ్జాలకు ఎంత డిమాండ్ ఉందో అందరికి తెలుసు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ పిజ్జా బ్రాండ్ డొమినోస్ (Domino’s) విపరీతమైన ధరలకు విక్రయిస్తోంది. కాగా తాజాగా కంపెనీ ధరలను దాదాపు 50 శాతం వరకు తగ్గించినట్లు తెలిపింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నిజానికి భారతదేశంలోని క్విక్ సర్వీస్ రెస్టారెంట్ (QSR) మాత్రమే కాకుండా టాసిన్, గోపిజ్జా, లియోస్ పిజ్జేరియా, మోజోపిజ్జా, ఓవెన్‌స్టోరీ, లా పినోజ్ వంటి సంస్థలు పుట్టుకురావడం, తక్కువ ధరలకే పిజ్జాలను అందించడంతో క్రమంగా డొమినోస్ ఆదరణ తగ్గుముఖం పట్టింది. కానీ పోటీ ప్రపంచంలో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి డొమినోస్ సన్నద్ధమైంది. ఇందులో భాగంగానే ధరలను తగ్గించడం జరిగింది.

మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, మారుతున్న వినియోగదారుల అవసరాలను తీర్చడానికి డొమినోస్ కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగానే వెజిటేరియన్ లార్జ్ పిజ్జా ధరలను రూ. 799 నుంచి రూ. 499కి తగ్గించింది. అదే సమయంలో లార్జ్ నాన్‌వెజ్ పిజ్జా ధరలను రూ. 919 నుంచి రూ. 549కి దగ్గించింది.

ఇదీ చదవండి: మొబైల్ బ్యాంకింగ్ కొత్త యాప్.. రూ.5 లక్షల వరకు లోన్!

తక్కువ చెల్లించి ఎక్కువ పిజ్జా పొందండి అంటూ కంపెనీ పిజ్జా ప్రియులకు శుభవార్త చెప్పింది. భారతదేశంలో 1800కి పైగా డొమినోస్ పిజ్జా కేంద్రాలు ఉన్నాయి. వీటన్నింటిని డొమినోస్ మాతృ సంస్థ 'జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్' నిర్వహిస్తోంది. ఈ కంపెనీ డొమినోస్ కంపెనీతో పాటు డంకిన్ రెస్టారెంట్లను, పాప్ఐస్ ఔట్ లెట్లను నిర్వహిస్తోంది.

భారతదేశంలో కేవలం డొమినోస్ మాత్రమే కాకుండా, పిజ్జా హట్, మెక్ డొనాల్డ్స్ వంటి కంపెనీలు తమ అమ్మకాలను పెంచుకోవడానికి, కస్టమర్లను ఆకర్షించడానికి ధరలను తగ్గించనున్నాయి. కాగా దేశీయ మార్కెట్లో పిజ్జా చైన్స్ కూడా ఎక్కువ కావడంతో కస్టమర్లు తక్కువ ధరకు పిజ్జా అందించే సంస్థల నుంచే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. మొత్తానికి చిన్న సంస్థల దెబ్బకు డొమినోస్ దిగి వచ్చినట్లు స్పష్టమవుతోంది.

మరిన్ని వార్తలు