ఇంధన ధరల పెంపుపై 9 నెలల్లో కేంద్రం చెప్పిన 9 కారణాలు..!

2 Oct, 2021 20:02 IST|Sakshi

ఆకాశమే హద్దుగా ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సామాన్యుడికి పెను భారంగా మారుతున్నాయి. కొన్ని రోజులపాటు నిలకడగా ఉన్న ఇంధన ధరలు వరుసగా మూడో రోజు శనివారం దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధరలు గణనీయంగా పెరగడంతో  చమురు కంపెనీలు డీజిల్‌ ధరల్ని ఊహించని విధంగా  పదిరోజుల వ్యవధిలో ఆరుసార్లు పెంచాయి. ఇంధన ధరలు పెరగడానికి కేంద్రం పలు కారణాలను చెప్తూ వస్తోంది. 
చదవండి: ఆనంద్‌ మహీంద్రా, రాకేశ్‌ జున్‌జున్‌వాలా..అతని తర్వాతే..!

తొమ్మిది నెలల్లో కేంద్రం చెప్పిన కారణాలు ఇవే...!

1. ఈ పాపమంతా గత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదే  (2021 ఫిబ్రవరి 18)  

  • ప్రధానమంతి​ నరేంద్ర మోదీ ఇంధన ధరల పెంపుపై‘ గత ప్రభుత్వాలు ఇంధన దిగుమతులపై భారత్‌ ఆధారపడటాన్ని తగ్గించడంపై దృష్టి పెడితే, మధ్యతరగతి వారికి ఇంధన ధరలు అంత భారం ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. 

2. ఇంధన ధరలు పెరుగుదల ‘ధర్మ సంకటమే’..: ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌(2021 ఫిబ్రవరి 20)

  • ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇంధన ధరల పెరుగుదల' ధర్మసంకట్ ' పరిస్థితి అన్నారు. తుది ధర లేదా ఇంధన రిటైల్ ధర సహేతుకమైన స్థాయిలో ఉండేలా కేంద్రం, రాష్ట్రాలు ఒక మార్గాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు.

3.  ధర్మేంద్ర ప్రధాన్ ఇంధన ధరల పెంపు వెనుక అంతర్జాతీయ మార్కెట్ల వాదన (2021 ఫిబ్రవరి 22)

  • మాజీ కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, "అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా, రిటైల్‌ ఇంధన ధరలు పెరిగాయన్నారు. కోవిడ్‌-19 కారణంగా ముడిచమురు ఉత్పత్తి నెమ్మదించడంతో సరఫరా తగ్గిందన్నారు. 

4. ఇంధన ధరలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నుపై వెనుకడుగు: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (2021 మార్చి 5)

  • ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పన్నులను తగ్గిస్తే ఇంధన ధరలు అదుపులోకి వస్తాయన్నారు. అప్పుడు సామాన్యులపై భారం తగ్గుతుందని మీడియా సమావేశంలో వెల్లడించారు. 

5. సంక్షేమ పథకాలు, టీకాల కోసం ధరల పెంపు: మాజీ పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (జూన్ 14, 2021)

  • అధిక ఇంధన ధరలు సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయని అంగీకరిస్తూ, మాజీ పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, "ఇంధన ధరలు వినియోగదారులను చిదిమేస్తున్నాయని నేను అంగీకరిస్తున్నాను. అయితే కోవిడ్‌ టీకాల కోసం ఒక ఏడాదిలో రూ. 35,000 కోట్లు ఖర్చు అవుతోంది.ఇటీవల, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద పేదలకు ఉచిత ఆహార ధాన్యాలను అందించడానికి ప్రధాన మంత్రి లక్ష కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించారు.

6.కాంగ్రెసే కారణం..!: ధర్మేంద్ర ప్రధాన్(2021 జూలై 3)

  • అప్పటి కేంద్ర పెట్రోలియం , సహజవాయువు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవలి ఇంధన ధరల పెంపును కాంగ్రెస్ పాలనతో ముడిపెట్టారు. ఆర్థికవేత్తలను ఉటంకిస్తూనే...అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కోట్ల విలువైన చమురు బాండ్లను వదిలిపెట్టిందని, అందుకే ప్రస్తుత భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం వాటికి వడ్డీ , ప్రధాన ధరలను  రెండింటినీ చెల్లిస్తోందని పేర్కొన్నారు. 

7. మౌలిక సదుపాయాలను నిర్మించడం కోసం ఎక్సైజ్‌ డ్యూటీ పెంపు అనివార్యం: ఆర్థికమంత్రిత్వ శాఖ(2021 జూలై 20)

  • రాజ్యసభలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు  ఆర్థికమంత్రిత్వ శాఖ సహయమంత్రి పకజ్‌ చౌదరీ సమాధానమిస్తూ...దేశంలో మౌలిక సదుపాయాలను నిర్మించడం కోసం ఇంధనంపై ఎక్సైజ్‌ డ్యూటీ పెంపు అనివార్యమైందని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పన్నులు పెంచాల్సి వస్తుందన్నారు. 

8.పెట్రోల్‌, డీజిల్‌పై అధిక పన్నులను కేంద్రం సమర్థిస్తోంది: పెట్రోలియం , సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పురి(2021 జూలై 26) 

  • ప్రతిపక్షాలు లోక్ సభలో అడిగిన ప్రశ్నకు  పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పురి సమాధానమిస్తూ.. పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని (పెట్రోలియం ఉత్పత్తులపై) వివిధ అభివృద్ధి పథకాలలో ఉపయోగించబడుతుందని, మహమ్మారి సమయంలో పేదలకు ఉపశమనం అందించడానికి ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన వంటి పథకాల కింద 80 కోట్ల మంది లబ్ధిదారులకు ఉచిత రేషన్ అందిస్తున్నామని తెలిపారు.

9. యూపీఎ ప్రభుత్వం చేసిన తప్పులకు మోదీ 2.0 చెల్లిస్తోంది: నిర్మలా సీతారామన్‌(2021 ఆగస్టు 16)

  • ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ.."గత యూపీఎ ప్రభుత్వం చేసిన ఆయిల్ బాండ్‌లకు పన్నులను చెల్లించే భారం లేకపోతే, పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఎక్సైజ్ సుంకం తగ్గించే పరిస్థితి ఉండేదని అభిప్రాయపడ్డారు. 

చదవండి: అతి తక్కువ ధరలోనే..భారత మార్కెట్లలోకి అమెరికన్‌ బ్రాండ్‌ టీవీలు..

మరిన్ని వార్తలు