వ్యాక్సిన్‌ మస్ట్‌.. ఆ తేదీ తర్వాత ఆఫీసులకు రావాల్సిందే!

29 Jul, 2021 07:37 IST|Sakshi

Google Employees Returning To Office: కరోనా నేపథ్యంలో సుమారు ఏడాదిన్నరగా వర్క్‌ఫ్రమ్‌ హోంలోనే ఉండిపోయారు కోట్ల మంది ఉద్యోగులు. అయితే సెప్టెంబర్‌ మొదటి వారం నుంచి ఆఫీసులకు రావాల్సిందేనని చాలా కంపెనీలు మెయిల్స్‌ ద్వారా కరాకండిగా చెప్పేశాయి. కానీ, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కొంతకాలం వర్క్‌ఫ్రమ్‌ నడిపించాలని భావిస్తున్నాయి. ఈ మేరకు బుధవారం ఉద్యోగులకు స్వల్ప ఊరటనిచ్చే ప్రకటన విడుదల చేశాయి. 

సిలికాన్‌ వ్యాలీ: సెప్టెంబర్‌ మొదటి వారం నుంచి మూడు రోజులు వర్క్‌ ఫ్రమ్‌ ఆఫీస్‌ బేస్‌ మీద ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశాయి కంపెనీలు. తాజాగా వర్క్‌ఫ్రమ్‌ హోంను మరో నెలకు పైనే కొనసాగించాలని కంపెనీలు నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు గూగుల్‌, ఫేస్‌బుక్‌, యాపిల్‌తో పాటు కొన్ని ఎమ్‌ఎన్‌సీలు ఉద్యోగులకు మెయిల్స్ పంపించాయి. అక్టోబర్‌ 18 వరకు ఉద్యోగులు వర్క్‌ఫ్రమ్‌హోంలోనే కొనసాగొచ్చని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ వెల్లడించారు. ఇక గూగుల్‌ నుంచి ప్రకటన వెలువడిన కాసేపటికే యాపిల్‌, ఆ వెంటనే ఫేస్‌బుక్‌ కూడా దాదాపు ఇలాంటి ప్రకటనే విడుదల చేశాయి. 

వ్యాక్సిన్‌లు వేయించుకున్నాకే ఆఫీసులకు రావాలని, కనీసం ఒక్క డోస్‌ వేయించుకున్నా సరిపోతుందని ఉద్యోగులకు తప్పనిసరి ఆదేశాల్లో పేర్కొన్నాయి కంపెనీలు. సడలింపు గడువును వ్యాక్సిన్‌ డోసుల కోసం ఉపయోగించుకోవాలని పిలుపు ఇచ్చింది. ఉద్యోగుల ఆరోగ్య భద్రత-ప్రశాంతతమే తమకు ముఖ్యమని,  ఈ పాలసీని యూఎస్‌ నుంచి మిగతా దేశాలకు విస్తరిస్తామని, కరోనా డెల్టా వేరియెంట్‌ విజృంభణ-ఎంప్లాయిస్‌లో భయాందోళనలు.. వ్యాక్సినేషన్‌ రేటు తక్కువగా ఉంటుండడంతో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే వ్యాక్సినేషన్‌ రేటు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం వీలైనంత త్వరగా ఆఫీసులకు ఉద్యోగులకు రప్పించే ప్రయత్నం చేస్తామని ఫేస్‌బుక్‌ తన ప్రకటనలో స్పష్టం చేసింది. ఇక తాజా ఆదేశాలతో మరికొన్ని కంపెనీలు కూడా వర్క్‌ ఫ్రమ్‌ హోంని మరికొన్ని రోజులు కొనసాగించే అవకాశం ఉందని నిపుణలు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు