April : అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే!

4 Apr, 2022 08:35 IST|Sakshi

ముందుగా మీ అందరికీ శుభకృత్‌ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఆర్థిక సంవత్సరం మొదలు మీ అందరి ఆరోగ్యం బాగుండాలని, మీ ఆర్థిక వ్యవహారాలు ఏ చింతలు లేకుండా జరగాలని కోరుకుంటూ .. కొత్త ఆర్థిక సంవత్సరంలో అమల్లోకి వచ్చే కీలక అంశాలు మీకోసం. 

అనుసంధానించకపోతే ‘పాన్‌’ పనిచేయదు: అవును. 31–3–2022 తేదీలోపల పాన్‌తో అనుసంధానం చేయని వారి పాన్‌ పనిచేయదు. దాన్ని స్తంభింపచేస్తారు. వాడుకలో ఉండదు. చెల్లుబడి కాదు. అంటే మీరు ఏ సందర్భంలోను పాన్‌ని ప్రస్తావించాలో, ఏ సందర్భంలో అయితే నంబర్‌ను పేర్కొనాలో ఆ సమయంలో పాన్‌ వాడకూడదు. అంటే కొన్ని ఆర్థిక వ్యవహారాలు చేయలేరు. అయితే, డిపార్ట్‌మెంట్‌పరమైన కార్యకలాపాల్లో ఇది చలామణీలో ఉంటుంది. అనుసంధానం చేయకపోవడం .. రద్దు వల్ల వాడకూడదు కాబట్టి ఇవ్వలసిన చోట ఇవ్వకపోయినా.. పాన్‌ తెలియజేసినా .. పాన్‌ని ప్రస్తావించినా శిక్షార్హులు. కొందరు ఇక్కడ ఉండీ అనుసంధానం చేయలేదు. మరికొందరు విదేశాల్లో ఉండిపోవడం వల్ల చేయలేదు. అటువంటి వారికి వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. 1–4–22 నుండి 30–6–2022 వరకూ రూ. 500, అది దాటితే 1–7–2022 నుండి 31–3–2023 వరకూ రూ. 1,000 ఫీజు కింద చెల్లించి అనుసంధానం చేసుకోవచ్చు. అలా చేసుకున్న తర్వాత పాన్‌ను మళ్లీ యధావిధిగా వాడుకోవచ్చు. 

 క్రిప్టో ఆస్తుల మీద పన్ను: 2022 ఏప్రిల్‌ 1 నుండి క్రిప్టో కరెన్సీలపై, నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్స్‌ (ఎన్‌ఎఫ్‌టీ) మీద 30 శాతం పన్ను విధిస్తారు. 31–03–2023 నాటి విలువ మీద పన్ను చెల్లించాలి. 

 ఆదాయపు పన్ను మదింపులో అధికారులు ముసుగు వేసుకున్న వీరుల్లా తయారవుతారు. ఒకరి ముఖం ఒకరికి కనపడదు. అంతా ఫేస్‌లెస్సే. 

► స్థిరాస్తుల వ్యవహారాల్లో (వ్యవసాయ భూములకు వర్తించదు) రూ. 50,00,000 ప్రతిఫలం దాటిన కేసుల్లో స్టాంప్‌ డ్యూటీ విలువ లేదా ఒప్పందంలో పేర్కొన్న విలువ .. ఏది ఎక్కువ ఉంటే ఆ మొత్తం మీద టీడీఎస్‌ రికవరీ చేయాలి. 1 శాతం చొప్పున చేయాలి. గతంలో కేవలం ఒప్పంద విలువ మీద చేయాల్సి వచ్చేది. కొత్త రూల్స్‌ ప్రకారం స్టాంప్‌ డ్యూటీని తీసుకువచ్చారు. 

► మరో అశనిపాతంలాంటిది ఏమిటంటే.. ప్రావిడెంట్‌ ఫండ్‌ మీద వడ్డీపరంగా ప్రతికూల పరిణామం. గతంలో మనం తెలుసుకున్నాం  ఉఉఉ (పన్నుపరమైన మినహాయింపుల) గురించి. కానీ కొత్త రూల్స్‌ ప్రకారం పీఎఫ్‌ జమలు రూ. 2,50,000 దాటితే ఆ ఆదనం మీద వచ్చే దాన్ని ఆదాయంగా పరిగణిస్తారు. అంటే పరోక్షంగా రూ. 2,50,000 దాటి జమ చేసినందుకు ఎటువంటి ప్రోత్సాహం ఉండదు. ఉన్న స్కీముల్లో పీపీఎఫ్‌ అత్యుత్తమం. హైక్లాస్‌ ఆదాయం ఉన్న వారికి దెబ్బ. సాధారణ, మధ్యతరగతి వారికి ఎటువంటి నష్టం లేదు. 

కోవిడ్‌ చికిత్స నిమిత్తం ఖర్చు పెట్టిన వైద్య ఖర్చులకు మినహాయింపు లభిస్తుంది. అయి తే అన్ని కాగితాలు, రుజువులు ఉండాలి.

మరిన్ని వార్తలు