ఎస్జీఎక్స్ నిఫ్టీ 60 పాయింట్లు మైనస్
నిఫ్టీకి 11,633-11,537 వద్ద సపోర్ట్స్!
యూఎస్ మార్కెట్లు 3.5 శాతం పతనం
నష్టాలతో ట్రేడవుతున్న ఆసియా మార్కెట్లు
బుధవారం ఎఫ్పీఐల విక్రయాలు
నేడు (29న) దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్జీఎక్స్ నిఫ్టీ 60 పాయింట్లు క్షీణించి 11,660 వద్ద ట్రేడవుతోంది.బుధవారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ అక్టోబర్ ఫ్యూచర్స్ 11,720 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ఉన్నట్టుండి అమెరికా, యూరోప్లలో మళ్లీ కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో బుధవారం యూఎస్ మార్కెట్లు 3.5 శాతం స్థాయిలో పతనమయ్య్యాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లు సైతం నష్టాలతో కదులుతున్నాయి. దేశీయంగా నేడు ఎఫ్అండ్వో కాంట్రాక్టుల ముగింపు కారణంగా మార్కెట్లు ఆటుపోట్లను చవిచూసే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
మార్కెట్లు బోర్లా
తొలుత అటూఇటుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి పతనంతో ముగిశాయి. వెరసి బుధవారం సెన్సెక్స్ 600 పాయింట్లు కోల్పోయి 39,922 వద్ద నిలవగా.. నిఫ్టీ 160 పాయింట్ల నష్టంతో 11,729 వద్ద స్థిరపడింది. అమెరికా, యూరోపియన్ దేశాలలో కోవిడ్-19 కేసులు పెరగుతుండటం, యూఎస్ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ప్రతిపాదించిన ప్యాకేజీపై అనిశ్చితి, దేశీయంగా డెరివేటివ్ సిరీస్ ముగింపు వంటి అంశాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో తొలుత 40,664 వద్ద గరిష్టానికి చేరిన సెన్సెక్స్ తదుపరి 39,775 దిగువన కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ సైతం 11,929 పాయింట్ల ఇంట్రాడే గరిష్టం నుంచి ఒక దశలో 11,685 దిగువకు జారింది.
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 11,633 పాయింట్ల వద్ద, తదుపరి 11,537 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,878 పాయింట్ల వద్ద, ఆపై 12,026 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్ కనిపించవచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 23,933 పాయింట్ల వద్ద, తదుపరి 23,634 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 24,656 పాయింట్ల వద్ద, తదుపరి 25,080 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని అభిప్రాయపడ్డారు.
ఎఫ్పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1,131 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే దేశీ ఫండ్స్(డీఐఐలు) సైలంట్ అయ్యాయి. మంగళవారం ఎఫ్పీఐలు రూ. 3,515 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1,571 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి. సోమవారం ఎఫ్పీఐలు రూ. 119.4 కోట్లు, డీఐఐలు రూ. 979 కోట్లు చొప్పున అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.