ఉత్కంఠకు తెర | Sakshi
Sakshi News home page

ఉత్కంఠకు తెర

Published Fri, Nov 10 2023 6:50 AM

బీజేపీ కార్యకర్తల సందడి  - Sakshi

గచ్చిబౌలి: శేరిలింగంపల్లి బీజేపీ అభ్యర్థి ఎంపికకు తెరదించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి గురువారం సాయంత్రం బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు రవికుమార్‌ యాదవ్‌కు పిలుపు వచ్చింది. ఈ మేరకు ఆయనకు టికెట్‌ ఖరారు చేస్తూ బీజేపీ అధిష్టానం ఫోన్‌ చేసి తెలిపింది. దీంతో మసీదుబండలోని బీజేపీ కార్యాలయం, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్‌, రవికుమార్‌ యాదవ్‌ నివాసంలో కార్యకర్తలు, నాయకులతో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు స్వీట్లు పంచి బాణాసంచా కాల్చారు. రాత్రి పొద్దుపోయాక బీజేపీ రాష్ట్ర నాయకులు కొండా విశ్వేశ్వర్‌ రెడ్డితో కలిసి ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి బయలుదేరారు. శుక్రవారం భారీ ర్యాలీతో నామినేషన్‌ వేసేందుకు రవి కుమార్‌ యాదవ్‌ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాష్ట్రంలోనే అతి పెద్ద నియోజకవర్గమైన శేరిలింగంపల్లి బీజేపీ అభ్యర్థి ఎంపిక ఆంశం ఎన్నో మలుపులు తీసుకుంది. బీజేపీ జాతీయ నాయకత్వం జనసేనతో పొత్తు ఖరారు చేయడంతో శేరిలింగంపల్లి బీజేపీ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ జటిలంగా మారింది. ఒక దశలో టికెట్‌ జనసేనకే దక్కుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో బీజేపీ కేడర్‌ను అయోమయం ఆవరించింది. చివరికి శేరిలింగంపల్లి టికెట్‌ జనసేనకు ఇవ్వకపోవడంతో స్థానిక బీజేపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. నామినేషన్‌ ఆఖరి రోజుకు కొద్ది గంటల ముందు రవి కుమార్‌ యాదవ్‌ను శేరిలింగంపల్లి అభ్యర్థిగా ప్రకటించి ఎట్టకేలకు ఉత్కంఠకు తెర దించింది.

శేరిలింగంపల్లి బీజేపీ అభ్యర్థిగా రవి కుమార్‌ యాదవ్‌

రవికుమార్‌ యాదవ్‌
1/1

రవికుమార్‌ యాదవ్‌

Advertisement
Advertisement