ప్రపంచంలోనే మొదటిసారి.. మిస్సింగ్‌ కేసులో అదిరిపోయే ట్విస్ట్‌

29 Sep, 2021 17:55 IST|Sakshi
పోలీసులతో కలిసి సెర్చ్‌ ఆపరేషన్‌లో పాల్గొన్న బెహాన్‌ ముట్లు (సర్కిల్‌లోని వ్యక్తి )

కనిపించడం లేదంటూ తనను తానే వెతుకున్న వ్యక్తి

టర్కీలో చోటు చేసుకున్న వింత సంఘటన

ఇస్తాంబుల్‌: కొన్ని రోజలు క్రితం తన నీడ పోయిందంటూ ఓ వ‍్యక్తి ఫిర్యాదు చేసే కథ ఆధారంగా తెలుగులో ఓ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇలాంటి సినిమాటిక్‌ సంఘటన ఒకటి వాస్తవంగా చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కనిపించకుండా పోయానని చెప్పి.. తనను తానే వెతుక్కున్నాడు. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది వాస్తవం. ఈ సంఘటన టర్కీలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. 

టర్కీకి చెందిన బెహాన్ ముట్లు(50) అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం స్నేహితులతో కలిసి ఇనెగల్ నగరానికి సమీపంలో ఉన్న శయ్యక గ్రామీణ ప్రాంతంలో ఓ పార్టీకి వెళ్లాడు. మద్యం ఎక్కువగా తీసుకోవడంతో మత్తులో పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లి.. స్పృహ కోల్పోయాడు. బెహాన్‌ ఎంతకి తిరిగి రాకపోవడంతో.. అతడి స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
(చదవండి: సోఫాతో ఆమెను చంపేద్దామనుకున్నావా ఏంటి?)

ఈ క్రమంలో పోలీసులు మిస్సింగ్‌ కంప్లైంట్‌ నమోదు చేసి.. గాలింపు చర్యలు ప్రారంభించారు. బెహాన్‌ తప్పిపోయిన అటవీ ప్రాంతానికి వెళ్లి.. అతడి పేరును పెద్దగా పిలుస్తూ.. గాలింపు చర్యలు కొనసాగించారు. స్పృహ కోల్పోయిన బెహాన్‌కి అప్పుడే కొద్దిగా మెలకువ వచ్చింది. పూర్తిగా మత్తు వదలలేదు. ఈ క్రమంలో అతడు పోలీసులతో కలిసి బెహాన్‌ గురించి అంటే తన గురించి తానే వెతకడం ప్రారంభించాడు. 
(చదవండి: వైరల్ స్టోరీ : ‘దేవుడు కరుణిస్తే.. అమ్మను చూస్తా’)

మరోసారి పోలీసులు బెహాన్‌ పేరు పిలవడంతో అతడి మత్తు వదిలిపోయింది. ఓ నిమిషం షాక్‌ అయ్యాడు. ఆ తర్వాత పోలీసులకు దగ్గరకు వెళ్లి.. ఎవరి గురించి వెతుకుతున్నారని ప్రశ్నించాడు. అప్పుడు పోలీసులు బెహాన్‌ అనే వ్యక్తి అడవిలో తప్పిపోయాడని తెలిపారు. వెంటనే బెహాన్‌.. వారు వెతుకుతుంది తన కోసమే అని తెలిపాడు. ఆ తర్వాత పోలీసులు బెహాన్‌ని అతడి ఇంటికి చేర్చారు. ఇక పోలీసులతో కలిసి గాలింపు చర్యల్లో పాల్గొన్న బెహాన్‌ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనలు.. బహుశా ప్రపంచంలోనే తనను తాను వెతుక్కున్న మొదటి వ్యక్తి ఇతడే అయ్యుంటాడు అని కామెంట్‌ చేస్తున్నారు. 

చదవండి: 1000 మంది గర్ల్‌ఫ్రెండ్స్‌.. 1075 ఏళ్ల జైలు శిక్ష

మరిన్ని వార్తలు