Road Accident: బస్సును ఢీకొట్టిన ఎస్‌యూవీ.. 11 మంది దుర్మరణం

5 Nov, 2022 08:56 IST|Sakshi

బెతుల్‌: మితిమీరిన వేగంతో వెళ్తున్న స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికిల్‌ (ఎస్‌యూవీ) ఆగి ఉన్న బస్సును ఢీకొన్న ఘటనలో ఎస్‌యూవీలోని మొత్తం 11 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మధ్యప్రదేశ్‌లోని బేతూల్‌ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘోరం చోటుచేసుకుంది. బాధితులంతా కూలీలే. మహారాష్ట్రలోని అమరావతి నుంచి సొంతూరుకు వెళ్తూ మృత్యువాత పడ్డారని పోలీసులు తెలిపారు.

డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమన్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఐదేళ్లలోపు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఎస్‌యూవీ నుజ్జవడంతో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీసేందుకు గ్యాస్‌ కట్టర్‌లను వాడాల్సి వచ్చింది. దీనిపై ప్రధాని మోదీ, సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.2 లక్షలు ప్రకటించింది. 

మరిన్ని వార్తలు