ఒమిక్రాన్‌: రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

28 Nov, 2021 16:04 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ:  కొత్త రకం కరోనా వేరియంట్‌ ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌పై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. ఓమిక్రాన్ రకం వైరస్‌ను గుర్తించిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో కఠినంగా స్క్రీనింగ్ నిర్వహించాలని తెలిపారు.

ఇంటెన్సివ్ కంటైన్‌మెంట్‌, చురుకైన నిఘా, వ్యాక్సినేషన్ విస్తృతం చేయాలంటూ రాష్ట్రాలకు సూచించారు. కోవిడ్-19 పరీక్షలను పెంచాలని ఆదేశించారు. కొన్ని రాష్ట్రాల్లో ఆర్టీ-పీసీఆర్ పరీక్షల సంఖ్య తగ్గినట్లు తెలిపారు. కోవిడ్‌ హాట్‌స్పాట్లను గుర్తించి, నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. పాజిటివిటీ రేటు 5శాతం కంటే ఎక్కువున్న ప్రాంతాలపై రాష్ట్రాలు దృష్టిసారించాలని తెలిపారు. 

చదవండి: Tamil Nadu Rains: తమిళనాడులో రెడ్ అలర్ట్​!! 2 వందల యేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు..

తగినంత వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కేంద్రం అందజేసిన నిధులను సమర్థవంతంగా వైద్య సదుపాయాల కల్పన కోసం వినియోగించాలని పేర్కొన్నారు. కొత్త రకం మ్యుటేషన్లను గుర్తించే జీనోమ్-సీక్వెన్సింగ్ పరీక్షలను పెంచాలని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్షియం ల్యాబ్‌లను వినియోగించుకోవాలని సూచించారు.

తప్పుడు సమాచారంతో భయాందోళనలు, అపోహలు చెలరేగకుండా ఎప్పటికప్పుడు సరైన సమాచారం అందించేలా ప్రెస్ బ్రీఫింగ్, కోవిడ్‌ బులెటిన్‌లను విడుదల చేయాలని పేర్కొన్నారు. ఓమిక్రాన్ రకం వైరస్ ప్రస్తుతం బ్రిటన్, జర్మనీ, ఇటలీ, బెల్జియం, ఆస్ట్రియా, బోట్స్‌వానా, ఇజ్రాయిల్, హాంగ్‌కాంగ్ (చైనా) దేశాల్లో గుర్తించిన విషయం తెలిసిందే.
చదవండి:  సౌతాఫ్రికా నుంచి ఇద్దరు: హమ్మయ్య.. వారికి సోకింది ఒమిక్రాన్‌ కాదు డెల్టా

మరిన్ని వార్తలు