సాక్షి, బనశంకరి (బెంగళూరు): దొంగతనానికి పాల్పడి సొత్తును విక్రయించి అత్తకుమార్తెకు దోచిపెట్టిన నవీన్ అనే వ్యక్తిని కేపీ అగ్రహర పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడి వద్ద నుంచి రూ.4.90 లక్షల విలువైన 109 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
డీసీపీ సంజీవ్పాటిల్ కథనం మేరకు.. కేపీ అగ్రహార నివాసి నవీన్, శివశంకరయ్యలు పరిచయస్తులు. గతనెల 28న శివశంకరయ్య నవీన్ ఇంటికి వెళ్లాడు. మాటల క్రమంలో ఇంటికి తాళం వేయలేదనే విషయాన్ని వెల్లడించగా నవీన్ తక్షణం శివశంకరయ్య ఇంటికి వెళ్లి 106 గ్రాముల నగలు కాజేశాడు. ఆ నగలు విక్రయించి తాను ప్రేమిస్తున్న అత్తకుమార్తెకు అందజేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నవీన్ను గురువారం అరెస్ట్ చేశారు.