అనుమానం పెనుభూతమై... 

23 Jun, 2021 08:41 IST|Sakshi
హతురాలు ఆశా(ఫైల్‌ ఫోటో)

సాక్షి, బొమ్మనహళ్లి(కర్ణాటక): భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ భర్త శాడిస్టుగా మారి ఆమె గొంతుకోసి హత్య చేసిన ఘటన నగరంలోని హులిమావు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. హతురాలు ఆశా (35) కాగా, నిందితుడు మణి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. వివరాలు... తమిళనాడుకు చెందిన ఈ జంట పదేళ్ల క్రితం గార పనుల కోసం బెంగళూరు వచ్చారు. మద్యం అలవాటు ఉన్న మణి భార్యపై అనుమానం పెంచుకున్నాడు.

నిత్యం మద్యం మత్తులో వచ్చి గొడవపడేవాడు. సోమవారం రాత్రి కూడా పీకలదాకా తాగి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. రాత్రి నిద్రలో ఉండగా ఆశా గొంతుకోశాడు. మంగళవారం ఉదయం పొద్దుపోయినా కూడా ఆశా బయటకు రాకపోవడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా ఆశా విగతజీవిగా రక్తపు మడుగులో పడి ఉంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.    

మరిన్ని వార్తలు