నాలుగేళ్ల అనంతరం చిన్నమ్మ విడుదల

27 Jan, 2021 11:33 IST|Sakshi

బెంగళూరు: తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆప్తురాలు వీకే శశికళ బుధవారం ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. అవినీతి కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించిన శశికళ ఈనెల 20న కరోనా బారిన పడ్డారు. దీంతో బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శశికళ జైలు నుంచి విడుదల కానున్న నేపథ్యంలో దానికి సంబంధించిన తంతు అంతా ఆస్పత్రిలోనే పూర్తి చేశామని జైలు అధికారులు ప్రకటించారు. ఇవాళ జైలు నుంచి విడుదల అయినప్పటికీ.. ఆస్పత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జి అవుతారన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆమెకు కరోనా లక్షణాలేవీ లేవని వైద్యులు తెలిపారు. 

ఇప్పుడు ఆమె ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, అయితే  కోవిడ్‌ నిబంధనల ప్రకారం ఆమె మరో 10 రోజుల పాటు ఆస్పత్రిలో కొనసాగే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. శశికళ జైలు నుంచి విడుదల అయిన సందర్భంగా భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు ఆమె అనుచరులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరప్పణ అగ్రహారం జైలు నుంచి చెన్నై వరకు కనీసం వెయ్యి వాహనాలతో స్వాగతం పలికేందుకు అమ్మ మక్కల్‌ మున్నేట్రకళగం అధినేత, ఎమ్మెల్యే దినకరన్‌ టీమ్ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. (శశికళను మళ్లీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తేలేదు)

>
మరిన్ని వార్తలు