Uttar Pradesh: మరో రైల్వే స్టేషన్‌ పేరు మార్చేసిన యోగి ప్రభుత్వం.. ఇక నుంచి

30 Dec, 2021 11:53 IST|Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూపీలోని ఝాన్సీ రైల్వే స్టేషన్‌ను.. వీరాంగణ లక్ష్మీబాయ్‌ రైల్వేస్టేషన్‌గా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకుంది.  దీనిపై మరికొద్ది రోజుల్లో అధికారికంగా ఉత్వర్వులు వెలువడనున్నాయని ఝాన్సీ పీఆర్‌వో మనోజ్‌ సింగ్ తెలిపారు. దీనిపై ఇప్పటికే కేంద్రం నుంచి ఆమోదం కూడా లభించిందని తెలిపారు. ఈ మేరకు యోగి ఆదిత్యానాథ్‌ ప్రభుత్వం, నిన్న(బుధవారం) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

రైల్వేస్టేషన్ పేరు మార్పు ప్రతిపాదనలను యోగి ప్రభుత్వం మూడు నెలల క్రితం.. కేం‍ద్ర హోంమంత్రిత్వశాఖకు పంపించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా చట్టపరమైన అనుమతులు పూర్తయ్యాక.. అధికారికంగా రైల్వేస్టేషన్‌ కోడ్‌ మారుస్తామని ఝాన్సీ  డీఆర్‌ఎం పీఆర్‌వో మనోజ్‌ సింగ్‌ తెలిపారు. 

ఇప్పటికే యోగి ప్రభుత్వం.. అలహాబాద్‌ను ప్రయాగ్‌ రాజ్‌గా, మొఘల్‌సరై రైల్వే‍ స్టేషన్‌ను పండిట్‌  దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ జంక్షన్‌గా, ఫైజాబాద్‌ రైల్వేస్టేషన్‌ను అయోధ్యకాంట్‌గా పేరు ‍మారుస్తు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 

చదవండి: కరెంట్‌ షాక్‌తో నలుగురు కాలేజీ ఉద్యోగుల దుర్మరణం

>
మరిన్ని వార్తలు