TN: కేసుల నుంచి ఆ ముగ్గురికీ ఉపశమనం

9 Nov, 2021 07:02 IST|Sakshi

సాక్షి, చెన్నై: గత ప్రభుత్వం వేసిన పరువు నష్టం దావా కేసుల్లో డీఎంకే  ఎంపీలు కనిమొళి, దయానిధి మారన్, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌కు విముక్తి లభించింది. సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా ఆధార రహిత ఆరోపణలు చేసినట్టు గత ప్రభుత్వ హయాంలో వీరిపై దావా దాఖలైంది. ఈ పిటిషన్‌ విచారణలో ఉండగా, రాష్ట్రంలో అధికారం మారింది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన డీఎంకే సర్కారు ఆ కేసుల్ని కొనసాగించలేమని, రద్దు చేయాలని కోర్టుకు సూచించింది. దీంతో ఆ ముగ్గురి మీద వేర్వేరుగా దాఖలైన పిటిషన్లు తిరస్కరిస్తూ, కేసు నుంచి విముక్తి కల్పిస్తూ సోమవారం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

చిక్కుల్లో ఎస్‌పీ వేలుమణి.. 
మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి చిక్కుల్లో పడ్డారు. ఆయనకు వ్యతిరేకంగా కోర్టులో దాఖలైన పిటిషన్‌పై పది వారాల్లో చార్జ్‌షీట్‌ దాఖలుకు ఏసీబీని హైకోర్టు ఆదేశించింది. ఎస్‌పీ వేలుమణిపై టెండ్లర్లలో అక్రమాలు అనేక ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన నివాసాలు, కార్యాలయాలపై ఏసీబీ దాడులు సైతం జరిగాయి. ఈ పరిస్థితుల్లో ఎస్పీ వేలుమణికి వ్యతిరేకంగా డీఎంకే ఎంపీ ఆర్‌ ఎస్‌భారతి దాఖలు చేసిన పిటిషన్‌ సోమవారం విచారణకు వచ్చింది. చార్జ్‌షీట్‌ దాఖలు చేయాలని, విచారణను త్వరితగతిన ముగించాలని ఏసీబీని కోర్టు  ఆదేశించింది.

మరిన్ని వార్తలు