రూ. 2 వేల నోటు : ఆర్‌బీఐ తాజా నివేదిక

25 Aug, 2020 16:04 IST|Sakshi

2019-20లో  ఒక్క 2వేల రూపాయల నోటు కూడా ముద్రించలేదు : ఆర్‌బీఐ

గణనీయంగా పెరిగిన 500, 200  రూపాయల నోట్ల  చెలామణి 

సాక్షి, న్యూఢిల్లీ: పెద్ద నోటు 2 వేల రూపాయల చలామణి క్రమంగా తగ్గుతోందని కేంద్రం బ్యాంకు నివేదిక తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం 2019-20లో ఒక్క 2,000 రూపాయల నోటు కూడా ముద్రించలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మంగళవారం వెల్లడించింది. 2018 నుంచి ఈ నోట్ల చలామణి క్రమంగా తగ్గిందని సెంట్రల్ బ్యాంక్ తన వార్షిక నివేదికలో పేర్కొంది. మరోవైపు 2018 నుంచి గత మూడేళ్లుగా 500, 200  రూపాయల నోట్ల  చెలామణి గణనీయంగా పెరిగినట్టు ఆర్‌బీఐ తెలిపింది.

చెలామణిలో ఉన్న 2 వేల విలువైన కరెన్సీ నోట్ల సంఖ్య 2018 మార్చి చివరి నాటికి 33,632 లక్షలు ఉండగా,  2019 మార్చి చివరినాటికి  32,910 లక్షలకు తగ్గింది. 2020 మార్చి ఆఖరికి  27,398 లక్షల నోట్లకు పడిపోయిందని ఆర్‌బీఐ నివేదిక తెలిపింది. 2020 మార్చి చివరి నాటికి మొత్తం నోట్ల వాల్యూమ్‌లో 2.4 శాతం 2,000 డినామినేషన్ నోట్లు ఉన్నాయని, ఇది 2019 మార్చి చివరినాటికి 3 శాతం, 2018 మార్చి నాటికి 3.3 శాతం తగ్గిందని నివేదిక పేర్కొంది. 2020 మార్చి చివరి నాటికి 22.6 శాతానికి పడిపోయింది, ఇది 2019 మార్చి చివరి నాటికి 31.2 శాతంగాను, 2018 మార్చి చివరి నాటికి 37.3 శాతంగాను ఉందని వివరించింది. (చదవండి : ఆర్థిక కార‍్యకలాపాలు పుంజుకునేందుకు మరింత సమయం)

కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నోట్ల సరఫరాను ప్రభావితం చేసిందని ఆర్‌బీఐ తెలిపింది. ప్రధానంగా కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ కారణంగా 2019-20లో నోట్ల సరఫరా కూడా మునుపటి సంవత్సరంతో పోలిస్తే 23.3 శాతం తగ్గిందని తెలిపింది. నకిలీ నోట్ల విషయానికొస్తే, గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2,96,695 నోట్లను గుర్తించగా, ఇందులో 2 వేల నోట్ల సంఖ్య17,020.

మరిన్ని వార్తలు