Pune: పెళ్లైన 5 నెలలకే ఘోరం.. నర్సుతో లవ్‌ ఎఫైర్‌.. భార్యకు ఇంజెక్షన్లు ఇచ్చి..

24 Nov, 2022 12:34 IST|Sakshi

ముంబై: ఆ జంటకు పెళ్లై అయిదు నెలలు. భవిష్యత్తుపై ఎన్నో ఊహలు, ఆశలతో వైవాహిక బంధంలోకి అడ్డుగుపెట్టిన ఆ ఇల్లాలి సంతోషం ఎంతో కాలం నిలవలేదు. పెళ్లై ఏడాది గడవకముందే భర్త పరాయి స్త్రీ మోజులో పడ్డాడు. జీవితంలో తోడూ నీడై తనకు అండగా ఉండాల్సిన వ్యక్తే ఆమె పాలిట యముడయ్యాడు. వాహేతర సంబంధానికి అడ్డొస్తుందనే కారణంతో కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. ఆపై ఆమె ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరించేందుకు ఓ పెద్ద కథను కూడా అల్లాడు. కానీ అదికాస్తా బెడిసి కొట్టడంతో చివరకు తప్పను ఒప్పుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది.

స్వప్నిల్ సావంత్(23) అనే యువకుడు పుణెలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తున్నాడు. అయిదు నెలల క్రితం ప్రింయాంక క్షేత్రేని వివాహం చేసుకొని అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. కొంతకాలంగా అక్కడే నర్సుగా చేస్తున్న సహోద్యోగితో సావంత్‌ ఎఫైర్‌ నడుపుతున్నాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో పెళ్లికి తన భార్య అడ్డుగా ఉందని భావించి ఆమెను అంతమొందించాలనుకున్నాడు.

నవంబర్‌ 14న భార్యకు ప్రాణాంతక ఇంజెక్షన్లు ఇచ్చి చనిపోయేలా చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వివాహితను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు. భార్య హత్యను ఆత్మహత్యగా నమ్మించేందుకు కుట్ర పన్నాడు. ప్రియాంక రాసినట్లు ఓ సుసైడ్‌ లేఖ కూడా రాశాడు.

అయితే పోలీసులకు భర్త ప్రవర్తనపై అనుమానం రావడంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. దర్యాప్తులో చేసిన నేరాన్ని అంగీకరించాడు. పనిచేస్తున్న ఆసుపత్రి నుంచి వెకురోనియం బ్రోమైడ్, నైట్రోగ్లిజరిన్ ఇంజెక్షన్లు,లోక్స్ 2% సహా కొన్ని మందులు ఇంజెక్షన్లను దొంగిలించాడని తేలింది. వాటిని భార్యకు ఇచ్చి హత్య చేసిన్టలు ఒప్పుకున్నాడు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని.. పూర్తి దర్యాప్తు జరుగుతోందని ఇన్‌స్పెక్టర్‌ మనోజ్‌ యాదవ్‌ వెల్లడించారు.
చదవండి: కోవిడ్‌లోనూ రెచ్చిపోయిన నాగేంద్ర బాబు.. వలలో ఎందరో సినీ ప్రముఖులు

మరిన్ని వార్తలు