ఫ్రీగా బంగారు నాణేలు, ఫ్రిజ్‌: కావాలంటే ఇది చేయాల్సిందే!

7 Jun, 2021 18:49 IST|Sakshi

పాట్నా: ఉచితంగా బంగారు నాణేలు, ఫ్రిజ్‌ తదితర గృహపకరోణాలు మీకు ఇస్తాం.. కానీ మీరు చేయాల్సిందల్లా ఒకటే పని. అది వ్యాక్సిన్‌ వేయించుకోవడమే. వ్యాక్సిన్‌ వేసుకునే వారికి ఓ జిల్లా అధికారులు ఈ విధంగా తాయిలాలు ప్రకటించారు. కరోనా వైరస్‌ రాకుండా ముందస్తు వేయించుకునే వ్యాక్సిన్‌కు ప్రజలు ముందుకు రావడం లేదు. దీంతో వ్యాక్సిన్‌ ప్రక్రియ వేగం పెంచేందుకు బిహార్‌లోని షియోహర్‌ జిల్లా అధికారులు ఆఫర్లు ఇస్తామని తెలిపారు.

జూలై 15వ తేదీ వరకు జిల్లాలో 45 ఏండ్లు నిండిన వారందరికీ 100 శాతం వ్యాక్సిన్‌ వేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఈ జిల్లాలో మొత్తం 53 గ్రామాలు ఉండగా వాటిలో 13 వరద ప్రభావిత గ్రామాలు ఉన్నాయి. వర్షాకాలం ప్రారంభమైతే వ్యాక్సిన్‌ వేసే పరిస్థితి ఉండదు. గ్రామాలన్నీ వరద ప్రభావానికి గురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆలోపే ఆ గ్రామస్తులందరికీ వ్యాక్సిన్‌ వేయాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. ఈ జిల్లాలో 45 ఏళ్లు పైబడినవారు మొత్తం 60,369మంది ఉన్నారు.

వాక్సిన్‌ త్వరగా వేయించుకోవడానికి వారు తరలివస్తారనే భావనతో ఈ ఆఫర్లు ఇచ్చారు. అయితే ఈ బహమతులు ఇచ్చేందుకు ఓ ప్రక్రియ ఏర్పాటుచేశారు. వ్యాక్సిన్‌ వేయించుకున్న వారిలో ప్రతి వారం ఐదుగురిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయనున్నారు. ఆ డ్రాలో ఎవరికి ఏం వచ్చిందో ఆ వస్తువులు అందించనున్నారు. బంగారు నాణేలు, ఫ్రిజ్‌లు, కూలర్లు, మైక్రోవేవ్స్‌ అందించనున్నారు. 

మరిన్ని వార్తలు