పెళ్లింట తీవ్ర విషాదం.. వరుడు సహా అక్కాచెల్లి మంటల్లో సజీవ దహనం

28 May, 2023 09:36 IST|Sakshi

కోల్‌కత్తా: పెళ్లి బాజాలు మోగాల్సిన పెళ్లింట విషాదం నెలకొంది. మరికొద్దిరోజుల్లో వివాహం జరుగుతుందనగా.. అనుమానాస్పద స్థితిలో పెళ్లికొడుకు సహా అతడి అక్కాచెల్లి మంటల్లో సజీవ దహనమయ్యారు. ఈ విషాదకర ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 

వివరాల ప్రకారం.. బెంగాల్‌లోని దుర్గాపూర్‌ ప్రాంతంలో హఫ్నా సోరెన్‌ కుటుంబం నివాసం ఉంటుంది. హఫ్నా సోరెన్‌కు ఇద్దరు కుమార్తెలు(సుమీ సోరెన్‌, బహమనీ సోరెన్‌) ఓ కుమారుడు(మంగళ్‌ సోరెన్‌) ఉన్నారు. కాగా, కుమారుడు మంగళ్‌ సోరెన్‌కు ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. ఆదివారం.. వధువు తరఫు కుటుంబసభ్యులు మంగళ్‌ ఇంటికి వచ్చి వివాహ ముహూర్తం ఖరారు చేయాల్సి ఉంది. ఈ కారణంగానే మంగళ్‌ సోదరీమణులు సుమీ, బహమనీ శుక్రవారం పుట్టింటికి వచ్చారు.

అయితే, పెళ్లి పనుల్లో భాగంగా హఫ్నా సోరెన్‌ శనివారం ఉదయం బయటకు వెళ్లారు. ఇక, ఆయన ఇంటి తిరిగి వచ్చే సరికి వారి ఇంటికి తాళం వేసి ఉంది. ఇదే సమయంలో ఇంట్లో నుంచి మంటలు రావడం గమనించాడు. దీంతో, వెంటనే ఇంటి తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా.. కుమారుడు, ఇద్దరు కూమార్తెలు విగతజీవులుగా పడి ఉన్నారు. వారు ముగ్గురు మంటల్లో సజీవ దహనమయ్యారు. కాగా, హఫ్నా ఇంట్లో ఎటువంటి సమస్యలు లేవని, అసలేం జరిగిందో తెలియట్లేదని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఇది కూడా చదవండి: తనను పెళ్లి చేసుకోవాలని నా భర్తను వేధించింది.. మమత కీలక వ్యాఖ్యలు

>
మరిన్ని వార్తలు