‘మోదీ, పంజాబ్ సీఎం మ‌ధ్య ర‌హ‌స్య స్నేహం ఉంది’

12 Jun, 2021 16:56 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ, పంజాబ్ సీఎం కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ మ‌ధ్య ర‌హ‌స్య స్నేహ బంధం ఉంద‌ని ఆప్‌ పార్టీ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా ఆరోపించారు. 2019-20 సంవ‌త్స‌రానికి కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించిన సామ‌ర్ధ్య గ్రేడింగ్ సూచీ (పీజీఐ)లో పంజాబ్ తొలి ర్యాంక్‌లో నిలిచిన అనంతరం సిసోడియా ఈ వ్యాఖ్య‌లు చేశారు. గత ఐదేళ్లలో పంజాబ్‌లో దాదాపు 800 ప్రభుత్వ పాఠశాలలను కెప్టెన్‌ సింగ్‌ మూసివేశారని విమర్శించారు. దీనికితోడు అనేక పాఠశాలలు ప్రైవేట్ సంస్థలకు అప్పగించారని.. కానీ పంజాబ్ అగ్రస్థానంలో ఉందంటూ ఎద్దేవా చేశారు.

పంజాబ్‌లో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు ద‌య‌నీయంగా ఉంటే అమ‌రీంద‌ర్ సింగ్ వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపుచ్చేందుకు పంజాబ్ స్కూళ్లు అద్భుతంగా ఉన్నాయ‌ని ప్ర‌ధాని నివేదిక ఇచ్చార‌ని మండిపడ్డారు. పంజాబ్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సౌకర్యాలు సరిగా లేవని, ఎక్కువశాతం తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నారని ఆయన ఆరోపించారు. ఇరువురు నేత‌ల మ‌ధ్య దోస్తీని ఇది వెల్ల‌డిస్తోంద‌ని వ్యాఖ్యానించారు. కాగా వచ్చే ఏడాది ప్రారంభంలో పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రతిపక్ష పార్టీగా ఉంది. బీజేపీ పంజాబ్‌లో మరో ప్రతిపక్ష పార్టీగా ఉంది.

చదవండి: 
పంజాబ్‌: జతకట్టిన శిరోమణి అకాలీదళ్‌, బీఎస్పీ!
BKU: ఢిల్లీ సరిహద్దులకు చేరుతున్న రైతులు

మరిన్ని వార్తలు