Shikar Dhawan T20 World Cup 2021: శిఖర్‌ ధావన్‌ను అందుకే ఎంపిక చేయలేదా!

9 Sep, 2021 11:26 IST|Sakshi

ముంబై: అక్టోబర్‌లో యూఏఈ వేదికగా జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2021కు సంబంధించి బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 15 మందితో కూడిన టీమిండియా ప్రాబబుల్స్‌ చూసి కొంతమంది అభిమానులు షాక్‌కు గురయ్యారు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న శిఖర్‌ ధావన్‌ను ఎంపికచేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అయితే ఓపెనింగ్‌ స్లాట్‌లో ఖాళీ లేకపోవడంతోనే ధావన్‌ను పక్కన పెట్టాల్సి వచ్చిందని సెలక్టర్లు పేర్కొన్నారు. కానీ అభిమానులు ఈ కారణాన్ని ఏకీభవించడం లేదు. రెగ్యులర్‌ ఓపెనర్లకు తోడుగా మూడో ఓపెనర్‌గా ఇషాన్‌ కిషన్‌ను ఎంపిక చేశారని.. అనుభవంలో ధావన్‌ ఎంతో ముందున్నాడని.. అసలు కారణం అది కాదని ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. 

చదవండి: టీమిండియా జట్టు ప్రకటన.. కొత్త బాధ్యతల్లో ధోని

అయితే ధావన్‌ను పక్కన పెట్టడానికి మరో కారణం కూడా ఉందని సమాచారం.  శిఖర్‌ ధావన్‌ బ్యాటింగ్‌లో నిలకడ ఉంటుందని.. కానీ ఆరంభంలో అతని బ్యాటింగ్‌ నెమ్మదిగా సాగుతుంది. క్రీజులో నిలుదొక్కుకున్న తర్వాత తనదైన శైలిలో వేగంగా ఆడడం ధావన్‌ స్టైల్‌. కానీ టీ20లు అంటేనే మెరుపులకు పెట్టింది పేరు. ధావన్‌ మంచి ఆటగాడే అయినప్పటికీ బంతులు ఎక్కువగా తీసుకుంటాడని.. అది ఆటకు సరిపోదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని ధావన్‌ స్థానంలో ఇషాన్‌ కిషన్‌ను మూడో ఓపెనర్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.


ధావన్‌ లాంటి స్థిరమైన ఆటగాడి అవసరం ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో అతని అవసరం జట్టుకు ఉపయోగపడదని సెలక్టర్లు పేర్కొన్నట్లు సమాచారం. తాజాగా ధావన్‌ వ్యక్తిగత జీవితం కూడా అతని ఎంపికపై ప్రభావం చూపినట్లు ఫ్యాన్స్‌ పేర్కొంటున్నారు. ధావన్‌, అయేషా ముఖర్జీలు తొమ్మిదేళ్ల వైవాహిక జీవితం అనంతరం విడాకులు తీసుకోవడం అతని కెరీర్‌పై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందంటున్నారు.

చదవండి: Ayesha Mukherjee: అసలు ఎవరీ అయేషా..? శిఖర్‌తో విడిపోవడం వెనుక..

Shikhar Dhawan-Ayesha Mukherjee Divorce: శిఖర్‌ ధావన్‌ విడాకులు

వాస్తవానికి 35 ఏళ్ల శిఖర్‌ ధావన్‌ లంక పర్యటనతో పాటు ఐపీఎల్‌ 2021 సీజన్‌లో మంచి ప్రదర్శనను కనబరిచాడు. ముఖ్యంగా ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న శిఖర్‌ ధావన్‌ 8 మ్యాచ్‌ల్లో 380 పరుగులతో లీడింగ్‌ టాప్‌ స్కోరర్‌గా ఉన్నాడు. అంతేకాదు లంక పర్యటనలోనూ అటు కెప్టెన్సీలోనూ.. ఇటు బ్యాటింగ్‌లోనూ మంచి ప్రదర్శనను కనబరిచాడు. ఇవీ గాక ధావన్‌కు ఐసీసీ టోర్నమెంట్‌లో మంచి రికార్డు ఉంది. 2013 చాంపియన్స్‌ ట్రోపీని భారత్‌ గెలవడంలో శిఖర్‌ ధావన్‌ పాత్ర కీలకం. ఆ టోర్నీలో టీమిండియా ఓపెనర్‌గా రాణించిన ధావన్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచి ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచాడు. ఇక బ్యాకప్‌ ఓపెనర్‌గా శిఖర్‌ ధావన్‌ సరిపోతాడనేది చాలా మంది అభిప్రాయం. ఇషాన్‌ కిషన్‌కు మంచి స్ట్రైక్‌ రేట్‌ ఉండొచ్చు.. కానీ అనుభవంలో మాత్రం ధావన్‌కు పోటీగా రాలేడని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు