IND VS SL 2nd Test: కుల్దీప్‌ను జట్టు నుంచి తొలగించలేదు.. బుమ్రా కీలక ప్రకటన

11 Mar, 2022 20:10 IST|Sakshi

బెంగళూరు వేదికగా రేపటి (మార్చి 12) నుంచి శ్రీలంకతో ప్రారంభంకానున్న రెండో టెస్ట్‌ (పింక్‌ బాల్‌తో డే అండ్‌ నైట్‌)కు ముందు టీమిండియా వైస్‌ కెప్టెన్‌ జస్ప్రీత్‌ బుమ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. వర్చువల్‌ మీడియా కాన్ఫరెన్స్‌లో భాగంగా బుమ్రా మాట్లాడుతూ..  కుల్దీప్ యాదవ్‌ను జట్టు నుంచి తొలగించారనే విషయంపై స్పష్టత ఇచ్చాడు. కుల్దీప్‌ బయో బబుల్‌లో ఎక్కువ కాలం నుంచి ఉన్నాడని, అందుకే అతనికి విశ్రాంతి ఇచ్చామని, కుల్దీప్‌ను అకారణంగా జట్టు నుంచి తప్పించారన్నది అవాస్తవమని వివరణ ఇచ్చాడు. 

బయో బబుల్‌లో ఎక్కువ కాలం ఉండటం అంత తేలికైన విషయం కాదని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే చైనామన్ బౌలర్‌కు విశ్రాంతి ఇచ్చామని చెప్పుకొచ్చాడు.  కుల్దీప్‌ను రిలీజ్ చేయడంతో అతని స్థానాన్ని అక్షర్‌ పటేల్‌తో భర్తీ చేశామని తెలిపాడు. ఇదే సందర్భంగా పింక్ బాల్ టెస్ట్‌పై బుమ్రా స్పందిస్తూ.. టీమిండియా పింక్‌ బాల్‌ టెస్ట్‌లు ఎక్కువగా ఆడలేదని, ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లు భిన్నమైన పిచ్‌లపై ఆడినవని,  బెంగళూరు పిచ్‌ కూడా అంతే భిన్నంగా ఉండాలని ఆశిస్తున్నామని పేర్కొన్నాడు. 

ఇదిలా ఉంటే, మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా అద్భుతమైన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అదే జైత్రయాత్రను రెండో టెస్ట్‌లోనూ కొనసాగించాలని ఆరాటపడుతున్న రోహిత్ సేన.. డే అండ్ నైట్ టెస్ట్‌లోనూ విజయం సాధించి మరో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. గతంలో టీమిండియా ఆడిన మూడు పింక్ బాల్ టెస్ట్‌ల్లో (బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్) రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైంది.
చదవండి: 'పింక్‌బాల్‌ టెస్టు సవాల్‌తో కూడుకున్నది.. మానసికంగా సిద్ధం'

మరిన్ని వార్తలు