WTC 2021-23 Points Table: పాక్‌ను వెనక్కు నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లిన టీమిండియా..

13 Sep, 2021 09:04 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్షిప్‌(2021-23) పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఇంగ్లండ్‌పై 2-1 తేడాతో సిరీస్‌ విజయం సాధించిన(అనధికారికంగా) భారత్‌.. దాయాది పాకిస్తాన్‌ను వెనక్కు నెట్టి 26 పాయింట్లతో టాప్‌ ప్లేస్‌కు చేరింది. ప్రస్తుత డబ్ల్యూటీసీలో భాగంగా టీమిండియా ఇప్పటివరకు 4 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడగా.. అందులో 2 మ్యాచ్‌ల్లో గెలుపు, ఓ మ్యాచ్‌లో ఓటమి, మరో మ్యాచ్‌ డ్రా చేసుకుకోవడం ద్వారా 54.17 విజయాల శాతం నమోదు చేసింది. ఆగస్ట్‌లో జరిగిన విండీస్‌ పర్యటనలో ఒక టెస్ట్‌ను కోల్పోయి మరో మ్యాచ్‌లో గెలుపొందిన పాక్‌.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రెండో ప్లేస్‌లో నిలచింది. 


రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ ద్వారా పాక్‌ 50 శాతం విజయాలతో 12 పాయింట్లు సాధించింది. ఈ సిరీస్‌లో పాక్‌ ప్రత్యర్ధి విండీస్‌ సైతం ఇదే గణాంకాలు నమోదు చేసి పాక్‌తో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచింది. ఇక స్వదేశంలో కోహ్లి సేనపై 2 పరాజయాలు, ఓ డ్రా, ఓ విజయం నమోదు చేసిన రూట్‌ సేన 14 పాయింట్లు ఖాతాలో వేసుకుని 29.17 విజయాల శాతంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. డబ్ల్యూటీసీలో భాగంగా పాయింట్లను కాకుండా విజయాల శాతాన్ని పరిగణలోకి తీసుకుని ర్యాంక్‌ల కేటాయింపు జరుగుతుంది. ఇక భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య సిరీస్‌లో ఐదో టెస్ట్‌ రద్దు కావడంతో పాయింట్ల కేటాయింపుపై సందిగ్ధత నెలకొంది. దీంతో ప్రస్తుత గణాంకాలు నాలుగో టెస్ట్‌ వరకు మాత్రమే పరిగణలోకి తీసుకుని కేటాయించారు. మరోవైపు, ఈ సిరీస్‌లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా భారత్‌, ఇంగ్లండ్‌ జట్లకు చెరి రెండు పాయింట్లు కోత విధించారు.
చదవండి: సిరీస్‌ ఇలా ముగియడం సిగ్గుచేటు.. ఆఖరి టెస్ట్‌ రద్దుపై ఆండర్సన్‌ భావోద్వేగం

మరిన్ని వార్తలు