వాళ్లు ఓ పక్క కష్టపడుతుంటే.. నువ్వేంటి రోహిత్‌ ఇలా!

15 Mar, 2021 12:19 IST|Sakshi
రెండో మ్యాచ్‌ సందర్భంగా రోహిత్‌ శర్మ(ఫొటో కర్టెసీ: ట్విటర్‌)

అహ్మదాబాద్‌: టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌ విషయంలో గతంలో ఎన్నోసార్లు ట్రోలింగ్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి హిట్‌మ్యాన్‌పై వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడుతున్నారు నెటిజన్లు. ‘‘రోహిత్‌ మ్యాచ్‌ ఆడకపోవడానికి అసలు కారణం ఏమిటంటే.. తనకు ఆట కంటే వడాపావ్‌ తినడమే ముఖ్యం’’ అని ట్రోల్‌ చేస్తున్నారు. భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌కు సంబంధించిన ఓ వీడియోను షేర్‌ చేస్తూ ఈ మేరకు స్పందిస్తున్నారు. కాగా టీ20 ప్రపంచకప్‌ సన్నాహకాల్లో భాగంగా, ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి రెండు టీ20ల్లో రోహిత్‌కు విశ్రాంతినిస్తున్నట్లు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ప్రకటించిన విషయం విదితమే. 

ఈ క్రమంలో హిట్‌మ్యాన్‌ గైర్హాజరీలో మొదటి టీ20లో చిత్తుగా ఓడిన టీమిండియా, ఆదివారం నాటి రెండో మ్యాచ్‌లో అంతకు అంతా బదులు తీర్చుకుంది. మోర్గాన్‌ సేనపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక రెండో మ్యాచ్‌ సందర్భంగా, బెంచ్‌ మీదున్న రోహిత్‌ ఏదో తింటున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సపోర్టు సిబ్బంది వెనుక ఫుడ్‌ను దాచి, చాటుగా తింటున్నట్లుగా ఉన్న ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు.  సహచర ఆటగాళ్లు మైదానంలో కష్టపడుతుంటే, నువ్వేంటి ఇలా రోహిత్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. అయితే, రోహిత్‌ ఫ్యాన్స్‌ మాత్రం ఈ విమర్శలను తిప్పికొడుతున్నారు. రోహిత్‌ టీంలో లేకుంటే ఆ లోటు స్పష్టంగా కనబడుతుందని, కానీ కావాలనే ఈ స్టార్‌ ఓపెనర్‌ను తప్పించి కోహ్లి ‘గేమ్స్‌’ ఆడుతుంటే వాటిని పక్కనపెట్టి ఇలా తిండి గురించి కామెంట్‌ చేయడం ఏమిటని మండిపడుతున్నారు. 

చదవండిఅప్పట్లో ఇలాగే జరిగింది.. జార్ఖండ్‌ నుంచి వచ్చి: సెహ్వాగ్‌
ఆ రూల్‌ నీకు కూడా వర్తిస్తుందా.. కోహ్లిపై ధ్వజమెత్తిన వీరూ

మరిన్ని వార్తలు