IPL 2022 Auction- PBKS: మరీ 16 కోట్లా.. పంజాబ్‌ కింగ్స్‌ సంచలన నిర్ణయం.. ఈసారి మొత్తం కొత్త జట్టుతో...

27 Nov, 2021 10:59 IST|Sakshi
Photo Courtesy: IPL

IPL 2022 Auction: Punjab Kings Unlikely To Retain Any Player Brand New Squad Why Here: పంజాబ్‌ కింగ్స్‌.. ఇంత వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్‌ ట్రోఫీ గెలవలేకపోయింది. పేరు మార్చినా.. కెప్టెన్లను మార్చినా తమ రాతను మాత్రం మార్చుకోలేకపోయింది. ఆఖరిదాకా పోరాడటం.. అసలు సమయం వచ్చేసరికి ప్రత్యర్థి జట్టు ముందు తలవంచడం పంజాబ్‌ జట్టుకు అలవాటేనని పలు సందర్భాల్లో నిరూపితమైంది కూడా. ఇక ఐపీఎల్‌-2021లోనూ పంజాబ్‌ కింగ్స్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆడిన 14 మ్యాచ్‌లలో ఆరింటిలో గెలిచినప్పటికీ నాకౌట్‌ దశకు చేరకుండానే లీగ్‌ నుంచి నిష్క్రమించింది. 

కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ 13 ఇన్నింగ్స్‌లో 626 పరుగులు సాధించి బ్యాటర్‌గా అద్భుతంగా రాణించినప్పటికీ.. జట్టును విజేతగా నిలపాలన్న అతడి కోరిక మాత్రం నెరవేరలేదు. ఇక ఐపీఎల్‌ 2022 మెగా వేలానికి సమయం ఆసన్నమవుతున్న తరుణంలో రాహుల్‌ పంజాబ్‌ను వీడటం ఖాయమని.. కొత్త ఫ్రాంఛైజీ లక్నోకు అతడు కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ రాహుల్‌ పంజాబ్‌ను వీడితే ఆ జట్టుకు నిజంగా పెద్ద షాకే.

ఈ నేపథ్యంలో పంజాబ్‌ కింగ్స్‌ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక్క ఆటగాడిని కూడా రీటైన్‌ చేసుకోకూడదని ఫ్రాంఛైజీ నిర్ణయించుకుందట. పూర్తిగా కొత్త జట్టుతో ఐపీఎల్‌ 2022 బరిలో దిగాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. తొలుత.. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, రవి బిష్ణోయి, అర్ష్‌దీప్‌ సింగ్‌ను రీటైన్‌ చేసుకోవాలని భావించినా.. రాహుల్‌ అందుకు సుముఖంగా లేకపోవడంతో ఏ ఒక్క ఆటగాడిని కూడా రీటైన్‌ చేసుకునేందుకు ఇష్టపడటం లేదని తెలుస్తోంది. 


PC: IPL

అసలు సమస్య ఏమిటి?
కేఎల్‌ రాహుల్‌ జట్టును వీడనుండటంతో పంజాబ్‌ ఒకవేళ మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ను రీటైన్‌ చేసుకోవాలని భావించినా.. బీసీసీఐ నిబంధనల కోసం మొదటి రిటెన్షన్‌ కోసం 16 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. నిజానికి మయాంక్‌ను కేవలం కోటి రూపాయలకు మాత్రమే ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. అలాంటపుడు అతడి కోసం ఏకంగా భారీ మొత్తం ఖర్చు చేయడం వృథా ప్రయాసే అవుతుందనే భావనలో యాజమాన్యం ఉండటం సహజం.

ఇక ఈ సీజన్‌లో మయాంక్‌ అగర్వాల్‌ వ్యక్తిగత ప్రదర్శన బాగానే (12 ఇన్నింగ్స్‌లో 441 పరుగులు) బాగానే ఉన్నప్పటికీ మరీ ఈ స్థాయిలో ఖర్చు పెట్టడానికి సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. అంతేగాక రవి, అర్ష్‌దీప్‌లను రీటైన్‌ చేసుకోవాలంటే పర్సు నుంచి పెద్ద మొత్తమే తీయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో జట్టు మొత్తాన్నే మార్చేసేందుకు పంజాబ్‌ ఫ్రాంఛైజీ యాజమాన్యం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. కేఎల్‌ రాహుల్‌ కోసం లక్నో ఎంతమొత్తమైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

చదవండి: T20 WC: పసికూన నమీబియా.. టీమిండియాతో సమానంగా.. కనీసం ఈసారైనా..

మరిన్ని వార్తలు