Sanjay Manjrekar: రహానే ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ ఆడాలి.. నేనైతే అతనికి మరో అవకాశం ఇవ్వను..

14 Jan, 2022 21:50 IST|Sakshi

దక్షిణాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌లో దారుణంగా విఫలమైన టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌, మాజీ వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానేపై భారత మాజీ క్రికెటర్‌, వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ సంచలన వ్యాఖ్యాలు చేశాడు. పేలవ ఫామ్‌లో ఉన్న రహానే తప్పనిసరిగా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడాలని ఆయన సూచించాడు. కేప్‌టౌన్‌ టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 10 పరుగులు మాత్రమే చేసిన రహానేకు తానైతే మరో అంతర్జాతీయ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడే అవకాశం ఇవ్వనని సంచలన వ్యాఖ్యలు చేశాడు.  

2020-21 ఆసీస్‌ పర్యటనలో రహానే చివరిసారిగా రాణించడం చూసామని, గతేడాది అతనాడిన 15 మ్యాచ్‌ల్లో 20.25 సగటున కేవలం 547 పరుగులు మాత్రమే చేశాడని, ఇక అతను తిరిగి ఫామ్‌లోకి వస్తాడన్న ఆశలు తనకు లేవని అన్నాడు. రహానేతో పోలిస్తే పుజారా కాస్త బెటర్‌ అని, అతనికైతే మరో అవకాశం ఇచ్చినా తప్పులేదని అభిప్రాయడ్డాడు. కాగా, దక్షిణాఫ్రికాతో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో రహానే 6 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 136 పరుగులు చేయగా, పూజారా 124 పరుగులు మాత్రమే చేశాడు.

ఇదిలా ఉంటే, మూడో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించి, 3 టెస్ట్‌ల సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా నిర్ధేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. కీగన్‌ పీటర్సన్‌(82) సమయోచితమైన బ్యాటింగ్‌తో దక్షిణాఫ్రికాను విజయపు అంచులదాకా తీసుకెళ్లగా.. డస్సెన్‌(41 నాటౌట్‌), బవుమా(32 నాటౌట్‌) జట్టును విజయతీరాలకు చేర్చారు.
చదవండి: Virat Kohli: 'ఆ ఇద్దరి' భవిష్యత్తు నిర్ణయించడం నా పని కాదు..

మరిన్ని వార్తలు