Murali Vijay: ఓర్నీ.. అందుకే మురళీ విజయ్‌ టోర్నీకి దూరంగా ఉన్నాడా?!

13 Nov, 2021 12:56 IST|Sakshi

Murali Vijay Refuses Covid 19 Jab Out Of Syed Mushtaq Ali Trophy: తమిళనాడు వెటరన్‌ క్రికెటర్‌ మురళీ విజయ్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ టోర్నీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, అతడు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం తాజాగా వెలుగులోకి వచ్చింది. కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ తీసుకునేందుకు ఈ ఓపెనర్‌ సిద్ధంగా లేడని.. అందుకే టోర్నీ నుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది. అంతేగాక బయో బబుల్‌లో ఉండేందుకు మురళీ విజయ్‌ నిరాకరించినట్లు సమాచారం.

ఈ విషయం గురించి తెలిసిన వర్గాలు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ... ‘‘అది తన వ్యక్తిగత నిర్ణయం.  వ్యాక్సిన్‌ తీసుకోవడానికి అతడు సుముఖంగా లేడు. కరోనా నేపథ్యంలో బీసీసీఐ మార్గదర్శకాలు పాటించడానికి సిద్ధంగా లేడు. టోర్నీ ఆరంభానికి ముందు బయో బబుల్‌లో ఉండాలని బీసీసీఐ నిబంధన విధించింది. విజయ్‌ మాత్రం ఎందుకో ఆసక్తి చూపలేదు.

దీంతో తమిళనాడు జట్టు ఎంపిక సమయంలో సెలక్టర్లు అతడిని పరిగణనలోకి తీసుకోలేదు’’అని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనంలో తెలిపింది. ఒకవేళ అతడు ఇప్పుడు జట్టులోకి రావాలన్నా ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాల్సి ఉంటుందని సదరు వర్గాలు తెలిపినట్లు వెల్లడించింది.

ఇక ఈ విషయం గురించి మురళీ విజయ్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా.. అతడు అందుబాటులోకి రాలేదని పేర్కొంది. కాగా 37 ఏళ్ల మురళీ విజయ్‌ ఒకప్పుడు టీమిండియాలో కీలక ప్లేయర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. టెస్టుల్లో 3982 పరుగులు సాధించిన అతడు.. గతేడాది ఐపీఎల్‌లో  ఆడాడు. ఇక తమిళనాడు తరఫున 2019లో చివరిసారిగా రంజీ ట్రోఫీ ఆడాడు.  

చదవండి: T20 World Cup 2021: అదరగొడుతున్న ఆడం జంపా.. అయినా గానీ...

మరిన్ని వార్తలు