మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం కోహ్లీ సేనకు నష్టమేనంటున్న యువీ

7 Jun, 2021 19:34 IST|Sakshi

ముంబై: ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్షిప్‌ ఫైనల్‌కు ముందు ఇంగ్లండ్‌తో సిరీస్​ఆడటం న్యూజిలాండ్‌కు కలిసొచ్చే అంశమని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ అభిప్రాయపడ్డాడు. భారత ఆటగాళ్లు ఐపీఎల్‌ 2021 ఆడి నేరుగా టెస్ట్‌ క్రికెట్‌ ఆడాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుందని పేర్కొన్నాడు. మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం కోహ్లీ సేనకు ఖచ్చితంగా ప్రతికూలతే అని వివరించాడు. మ్యాచ్‌కు ముందు 8 నుంచి 10 ప్రాక్టీస్ సెషన్లు ఉన్నా, మ్యాచ్ ప్రాక్టీస్‌కు ఇవి ప్రత్యామ్నాయం కాలేవని తెలిపాడు.  ఏదిఏమైనప్పటికీ ఫైనల్స్‌లో టీమిండియా విజయం సాధించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. డబ్యూటీసీ ఆలోచన మంచిదేనని, దీంతో టెస్ట్‌ క్రికెట్‌ను మరోస్థాయికి తీసుకెళ్లొచ్చని అభిప్రాయపడ్డాడు.

తాజాగా ఓ క్రీడాఛానెల్‌తో మాట్లాడిన యువీ.. ఫైనల్స్‌లో టీమిండియా విజయావకాశాలను విశ్లేషించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో కోహ్లీ సేన విదేశాల్లో అద్భుతంగా రాణిస్తోందని, దీంతో ఎక్కడైనా విజయం సాధించగలమనే ఆత్మ విశ్వాసం ఆటగాళ్లలో నెలకొందని ఆయన చెప్పుకొచ్చాడు. అయితే, ఇంగ్లండ్‌లోని పరిస్థితులకు అలవాటు పడటానికి టీమిండియా క్రికెటర్లకు కాస్త సమయం పడుతుందని, ఈ లోపే ఫైనల్‌ మ్యాచ్‌ ఆడాల్సి రావడం భారత్‌కు ప్రతికూలతేనని వివరించాడు. జట్ల బలాబలాలు చూస్తే.. అన్ని విభాగాల్లో ఇరు జట్లూ సమానంగా ఉన్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 

అయితే, డ్యూక్‌ బంతి విషయంలో టీమిండియా ఓపెనింగ్‌ జోడీ జాగ్రత్తగా వ్యవహరించాలని, ఇంగ్లండ్‌ వాతావరణ పరిస్థితులకు ఆ బంతి ఎక్కువగా స్వింగ్‌ అవుతుందని, ఇది కొత్త జోడీ అయిన రోహిత్ శర్మ, శుభమన్‌ గిల్‌కు సవాల్‌ లాంటిదేనని హెచ్చరించాడు. ఇక డబ్యూటీసీ ఫైనల్‌ను ఒక్క టెస్ట్‌తో సరిపెట్టకుండా, మూడు మ్యాచ్‌లుగా నిర్వహించాలని యువీ ఐసీసీకి సూచించాడు. సుదీర్ఘకాలం సాగే టోర్నీ కాబట్టి ఫైనల్‌ను ఒక్క మ్యాచ్‌తో సరిపుచ్చడం సబబు కాదని ఆయన అభిప్రాయపడ్డాడు. 
చదవండి: ఐసీసీ అధికారిక భాగస్వామిగా భారత్‌పే
 

మరిన్ని వార్తలు