బోధన్‌లో పోస్టర్ల కలకలం.. రాహుల్‌, రేవంత్‌ ఫోటోలతో విమర్శలు

25 Nov, 2023 09:36 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పర్యటన నేపథ్యంలో నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో పోస్టర్ల కలకలం రేగింది. రాహుల్ బోధన్ రాకను నిరసిస్తూ పోస్టర్లు వెలిశాయి. నిజామాబాద్, బోధన్‌లో గోడలకు పోస్టర్ల ప్రత్యక్షమయ్యాయి. తెలంగాణలో బలిదానాల బాధ్యత కాంగ్రెస్‌దేనని, మా బిడ్డలను చంపింది కాంగ్రెస్ పార్టీ అంటూ.. పోస్టర్లు అంటించారు. వీటిపై రాహుల్‌, రేవంత్‌ రెడ్డి ఫోటోలు ముద్రించి ఉన్నాయి. 

కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాల్సిందేనని,ముక్కు నేలకు రాయాల్సిందేనని డిమాండ్‌ చేస్తూ పోస్టర్లు అంటించారు. పోస్టర్లలో కర్నాటకలో కరెంటు కష్టాలు, నిరుద్యోగాన్ని ఎండగట్టారు. బళ్లారిలో జీన్స్ పరిశ్రమలకు విద్యుత్తు కోతలపై పత్రికల్లో వచ్చిన కథనాలు జత చేశారు.

‘కాంగ్రెస్‌కు ఓటేసిన పాపానికి కరెంటులేక అల్లాడుతున్న కర్నాటక. దివాళా తీస్తున్న పరిశ్రమలు.. కాంగ్రెస్‌ పేరెత్తితేనే జనం తిట్లు. గీ కన్నింగ్ కాంగ్రెస్ మనకు అవసరామా?.  కర్నాటకలో ఉద్యోగాలు కాదు ఉరితాళ్లే. కాంగ్రెస్‌కు ఓటేసిన పాపానికే నిరుద్యోగుల గోస.’ అంటూ పోస్టర్లు అంటించారు. 

కాగా బోధన్‌లో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. నర్సాపూర్ గేట్ వద్ద కాంగ్రెస్ విజయ భేరి సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్‌ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. రాహుల్‌ గాంధీ సమక్షంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు.
చదవండి: పాతబస్తీలో బడా వ్యాపారులే టార్గెట్‌గా ఐటీ సోదాలు

మరిన్ని వార్తలు