కిడ్నాప్‌ హైడ్రామా.. యువకుడిని చితకబాది కారులో ఎత్తుకెళ్లిన యువకులు

29 Dec, 2022 12:36 IST|Sakshi
యువకుడిని తీసుకెళ్లిన కారు ఇదే.. నరేశ్‌ 

సాక్షి, నిజామాబాద్‌: యువకుడి కిడ్నాప్‌ హైడ్రామా జిల్లాలో కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో మధ్యాహ్నం క్రేటా కారులో వచ్చిన ముగ్గురు ఫిజికల్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్న నరేశ్‌ను కిడ్నాప్‌ చేసినట్లు తెలుస్తోంది. యువకుడిని చితకబాది కారులో ఎక్కించుకొని వెళ్లిపోయారు. అక్కడున్న వారు కారు ఫొటోలను మీడియా, పోలీసులకు పంపించారు. దీంతో మూడోటౌన్‌ ఎస్సై శ్రావణ్‌కుమార్‌ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.

వెంటనే పెట్రోకారు బృందంతో పాటు మరో మూడు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు కారు నంబర్‌ ఆధారంగా బోధన్‌ వీడీసీ అధ్యక్షుడు బాగ య్యదిగా గుర్తించారు. పోలీసులు బాగయ్యను ఫోన్‌ లో విచారించగా తన అల్లుడైన అఖిలేష్‌ యాదవ్‌ ఉదయం ఇంటి నుంచి కారు తీసుకువెళ్లినట్లు చెప్పారు. అఖిలేష్‌యాదవ్‌తో పాటు అతని స్నేహితులు నిఖిల్, సాయికృష్ణ ఉన్నారు.

పోలీసులు బాగయ్య కుమారుడు భరత్‌ను పిలిపించి ఫోన్‌లో కాన్ఫరెన్స్‌ కలిపి అఖిలేష్‌ యాదవ్‌తో మాట్లాడించగా తాను బోధన్‌కు వస్తున్నట్లు చెప్పాడు. పోలీసులు అఖిలేష్‌యాదవ్‌ ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా వాహనాన్ని గుర్తించారు. కారును స్వాధీనం చేసుకొని, యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రేమ వ్యవహారమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో నరేశ్‌ను ఎడపల్లి మధ్యలో దింపేశారు.

కాగా నన్నెవరూ కిడ్నాప్‌ చేయలేదని బాధితుడు నరేశ్‌ పోలీసులకు తెలిపాడు. అందరం కలిసి మాట్లాడుకున్న తర్వాత ఎడపల్లి మధ్యలో విడిచిపెట్టారని చెప్పాడు. ఎవరినీ తాను టీజ్‌ చేయలేదని, నన్ను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదన్నాడు. ఎస్సై శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఎలాంటి కిడ్నాప్‌ జరగలేదన్నారు. ప్రేమ వ్యవహారం మాట్లాడినట్లు తెలిపారు.
చదవండి: ఇటీవలే యువకుడితో నిశ్చితార్థం.. తల్లి దగ్గరకు వెళ్లొచ్చి..

మరిన్ని వార్తలు