కోడెల శివరాం షోరూమ్‌ వద్ద హైడ్రామా..!

23 Aug, 2019 18:39 IST|Sakshi

సాక్షి, గుంటూరు : కోడెల శివరాం బైక్‌ షోరూమ్‌ వద్ద శుక్రవారం హైడ్రామా నెలకొంది. మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తన లాయర్‌తో కలిసి కొత్త డ్రామాలకు తెరతీశారు. బైక్‌ షోరూమ్‌ నుంచి అసెంబ్లీ అధికారులు ఫర్నీచర్‌ను రికవరీ చేసుకుంటున్న క్రమంలో వారిని అడ్డుకునే యత్నం జరిగింది. ఏ హోదాతో తనిఖీలు చేస్తారంటూ కోడెల లాయర్‌ అసెంబ్లీ అధికారులను ప్రశ్నించారు. షోరూమ్‌ ప్రైవేటు ప్రాపర్టీ అంటూ వితండవాదం చేశారు. అసెంబ్లీ సెక్రటరీ ఆదేశాలున్నాయని అసిస్టెంట్‌ సెక్రటరీ రాజ్‌స్పష్టం చేయడంతో రికవరీ కొనసాగింది. 

దాదాపు మూడు గంటలపాటు సాగిన ఈ సోదాల్లో అసెంబ్లీకి చెందిన పలు విలువైన వస్తువులను అధికారులు గుర్తించారు. అదంతా యూరప్‌ నుంచి దిగుమతి చేసుకున్న అత్యంత విలువైన విదేశీ ఫర్నీచర్‌గా తెలిసింది. వాటి విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందని అంచనా. 32 కుర్చీలు, 4 సోఫాలు, 3 టేబుళ్లు, ఒక టీపాయ్, ఒక దర్బార్ ఛైర్, డైనింగ్‌ టేబుల్‌, గుర్తించి.. తహసీల్దార్ మోహనరావు ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించారు. డైనింగ్ టేబుల్, 22 కుర్చీలు విలువే రూ.65 లక్షలు ఉంటుందని సమాచారం. ఇక తాళాలు లేవనే కారణంతో రెండో ఫ్లోర్‌, నాలుగో ఫ్లోర్‌లలో అధికారులు తనిఖీలు నిర్వహించలేదు. వారెంట్‌ లేకుండా తనిఖీలు చేస్తే కోర్టుకు వెళ్తామంటూ బెదిరింపులకు దిగారు.

అసెంబ్లీ ఫర్నిచర్‌ను దొంగచాటుగా తన ఇంటికి తరలించుకున్న కోడెల శివప్రసాదరావు తన తప్పును అంగీకరించిన సంగతి తెలిసిందే. భద్రత లేదనే అసెంబ్లీ వస్తువుల్ని తన ఇంటికి తెచ్చుకున్నానని వివరణనిచ్చారు. వాటన్నింటినీ తిరిగి ఇచ్చేస్తాననీ.. లేదంటే విలువెంతో చెబితే​ చెల్లిస్తానని చెప్పుకొచ్చారు. ఇక కోడెల క్యాంప్‌ ఆఫీస్‌లో తనిఖీలు చేయాల్సి ఉంది. ఫర్నీచర్‌ రికవరీ నిమిత్తం తన నివాసం, వ్యాపార స్థలాల్లో అసెంబ్లీ అధికారులు ఎప్పుడైనా  తనిఖీలు చేసుకోవచ్చని నిన్న వెల్లడించిన కొడెల శుక్రవారం మాటమార్చడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు