గోవధ జరగకుండా పటిష్ట చర్యలు

10 Aug, 2019 09:51 IST|Sakshi
రేంజ్‌ ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌కు వినతిపత్రం అందజేస్తున్న వీరాంజనేయులు

నేపాల్, భారత్‌ అంతర్జాతీయ గోరక్షా అభియాన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి జాస్తి వీరాంజనేయులు 

రేంజ్‌ ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌కు వినతి పత్రం అందజేత

సాక్షి, గుంటూరు: గుంటూరు రేంజ్‌ పరిధిలో బక్రీద్‌ పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని గోవధ జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని నేపాల్, భారత్‌ అంతర్జాతీయ గోరక్షా అభియాన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి జాస్తి వీరాంజనేయులు కోరారు. ఈ మేరకు శుక్రవారం ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ను ఆయన కార్యాలయంలో కలసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వీరాంజనేయులు మాట్లాడుతూ హిందువులకు గోమాత అంటే ఎనలేని భక్తి అన్నారు. వారి భక్తిని గౌరవించి ముస్లింలు గోవధకు దూరంగా ఉండాలని కోరారు.

మతాలు వేరైనా అందరం ఒక్కటే అని జీవించే ఏకైక దేశం మనది కావడంతో అందరం గర్వించాల్సిన విషయమని చెప్పారు. గోవధ జరగకుండా ముస్లింలు సహకరించాలన్నారు. అలాంటివి ఎక్కడైనా జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే సమీపంలోని పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. పాత గుంటూరులో అక్రమంగా ఉంచిన 50 గోవులను గుర్తించి వాటిని గోరక్షణ కేంద్రానికి తరలించామని తెలిపారు. గోవధకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐజీ కోరామన్నారు. 

 

మరిన్ని వార్తలు