బ్రెగ్జిట్ పై ఓటింగ్ షరూ..

23 Jun, 2016 15:45 IST|Sakshi

లండన్ : బ్రిట‌న్‌లో చరిత్రాత్మక రెఫ‌రెండ‌మ్‌కు సంబంధించిన ఓటింగ్  ప్రారంభమైంది. ప్రపంచ దేశాలు, ఆర్థిక నిపుణులు,  స్టాక్ మార్కెట్లు  ఎంతో ఉత్కంఠగా గమనిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ మొదలైంది.  యురోపియ‌న్ యూనియ‌న్‌లో బ్రిట‌న్ కొన‌సాగాలా   లేదా అనేది  ఈ రెఫరెండం ద్వారా   తేలిపోనుంది.  సుమారు 4 కోట్ల 64 ల‌క్షల మంది ఈ ఓటింగ్‌లో పాల్గొంటార‌ని అంచ‌నా. బ్రిట‌న్ కాల‌మానం  ప్రకారం ఉద‌యం 7 గంట‌ల నుంచి రాత్రి ప‌ది గంట‌ల వ‌ర‌కు ఓటింగ్ జ‌ర‌గ‌నుండగా ...రేపు (శుక్రవారం ఫ‌లితాలు వెలువ‌డే అవకాశం ఉంది.

 బ్రిటన్ ఈయూలోనే కొనసాగాలని కోరుతున్న 1,280 మంది పారిశ్రామికవేత్తలు ఒక హెచ్చరిక లేఖపై సంతకం చేస్తూ, బ్రెగ్జిట్ వల్ల ఆర్థిక అస్థిరత ఏర్పడుతుందని, ఉపాధి ప్రమాదంలో పడుతుందని పేర్కొన్నారు. పెద్ద పెద్ద కంపెనీలు ఈయూలో కొనసాగాలని భావిస్తుండగా, చిన్న సంస్థలు మాత్రం చీలిపోయాయి. ఈయూలో బ్రిటన్ కొనసాగడం వల్ల వాణిజ్యం మరింత పెరుగుతుందని, తద్వారా మరిన్ని ఉద్యోగాలు వస్తాయని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు.  ప్రచారంలో చివరి రోజు ప్రధాని కామెరూన్ మాట్లాడుతూ, ఈయూలో బ్రిటన్ ప్రత్యేక హోదాను అనుభవిస్తున్నదని అన్నారు. ఐరోపా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్నదని, ఇది ప్రపంచంలోనే ఏకైక అతిపెద్ద మార్కెట్ అనిపేర్కొన్నారు.
  కాగా బ్రిట‌న్ చ‌రిత్రలో ఇది మూడో రెఫ‌రెండ‌మ్‌. యునైటెడ్ కింగ్‌డ‌మ్ యురోపియ‌న్ యూనియ‌న్‌లో కొనసాగాలా వ‌ద్దా  అని అంశంపై ప్రజలు తమ అభిప్రాయాన్ని ఓటింగ్ ద్వారా తెలియజేయనున్నారు.  . ఎస్‌, నోల‌లో దేనికి 50 శాతం క‌న్నా ఎక్కువ ఓట్లు వ‌స్తే యూకే దానికి క‌ట్టుబ‌డి ఉంటుంది.  మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో  తమ దేశం సర్వం సిద్ధంగా ఉందని భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
 

>
మరిన్ని వార్తలు