జీఎస్టీలోకి పెట్రోల్, డీజిల్‌ ఇప్పట్లో చేరడం కష్టమే

22 Aug, 2018 00:23 IST|Sakshi

కేంద్రం, రాష్ట్రాల విముఖత

న్యూఢిల్లీ: సమీప భవిష్యత్తులో జీఎస్టీలోకి పెట్రోల్, డీజిల్‌ వచ్చి చేరే అవకాశం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున పన్ను ఆదాయం కోల్పోవాల్సి వస్తుందన్న ఆందోళనతో ఇందుకు సానుకూలంగా లేవని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. జీఎస్టీ గతేడాది జూలై 1 నుంచి అమల్లోకి రాగా, పెట్రోల్, డీజిల్, ముడి చమురు, సహజ వాయువు, విమాన ఇంధనం (ఏటీఎఫ్‌)లను మాత్రం ఇందులో చేర్చలేదు.

వీటిని సైతం జీఎస్టీలోకి చేర్చడం ద్వారా ధరల అస్థిరతలకు చెక్‌ పెట్టాలన్న అంశంపై పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ తదితరుల మధ్య చర్చలు జరిగినప్పటికీ, తక్షణ ప్రణాళిక ఏదీ లేదని ఆ అధికారి స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఆగస్ట్‌ 4న జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలోనూ చర్చ జరగ్గా, రాష్ట్రాలు ఇందుకు విముఖత చూపిన విషయం తెలిసిందే.

జీఎస్టీలో చేరిస్తే పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ రూపంలో రూ.20,000 కోట్ల ఆదాయం కోల్పోవాల్సి వస్తుంది. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.19.48, డీజిల్‌పై లీటర్‌కు రూ.15.33ను ఎక్సైజ్‌ సుంకం రూపంలో కేంద్రం రాబడుతుండగా, దీనికి అదనంగా రాష్ట్రాలు వ్యాట్‌ రూపంలో పెద్ద ఎత్తున ఆదాయం గడిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు