‘ఖాకీ’ మార్కు ప్రతాపం!

2 Jan, 2020 08:38 IST|Sakshi
కాలుతో తన్నుతున్న కానిస్టేబుల్‌ కర్రతో చితకబాదుతున్న దృశ్యం

కర్రలతో కొడుతూ.. బూటు కాళ్లతో తన్నుతూ..

ముగ్గురు విద్యార్థులపై పోలీసుల దాష్టీకం

సోషల్‌ మీడియాలో వైరల్‌

సిరిసిల్లటౌన్‌/సిరిసిల్ల క్రైం: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ముగ్గురు విద్యార్థులపై పోలీసులు తమ ప్రతాపం చూపించారు. కర్రలతో విచక్షణారహితంగా కొడుతూ.. బూటు కాళ్లతో తన్నుతూ అమానుషంగా ప్రవర్తించారు. పోలీసుల దాష్టీకానికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. మంగళవారం అర్ధరాత్రి సిరిసిల్ల పట్టణంలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన రాహుల్, బన్నీ, శ్యాం బైక్‌పై వచ్చారు. అక్కడే ఉన్న పోలీసులు.. వీరిని బ్రీతింగ్‌ అనలైజర్‌తో చెక్‌ చేశారు.

అనంతరం ఎస్సై వద్దకు తీసుకెళ్లారు. ఆపై ఎస్సైతోపాటు పలువురు కానిస్టేబుళ్లు వారిని విచక్షణా రహితంగా కొట్టారు. అయితే అదే స్థలంలో అంతకుముందు ఇరువర్గాల యువకులు ఘర్షణ పడగా పోలీసులు చెదరగొట్టారు. కాసేపటికే రాహుల్, బన్నీ, శ్యాం త్రిబుల్‌రైడింగ్‌లో వచ్చి పోలీసులకు చిక్కారు. అయితే.. పోలీసుల వాదన మరోలా ఉంది. రాజీవ్‌నగర్‌కు చెందిన శ్రీకాంత్, సతీశ్, శ్రీనివాస్, ప్రణయ్‌ బీరు బాటిళ్లతో రోడ్డుపై న్యూసెన్స్‌ చేశారని, వారిని వారిస్తున్న తమ సిబ్బందిపై దాడులకు పాల్పడుతూ.. విధులకు ఆటంకం కలిగించారని తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు