ప్రేమను కాదన్నందుకు అతి కిరాతకంగా..

5 Sep, 2018 09:55 IST|Sakshi
ప్రతికాత్మక చిత్రం

జైపూర్‌ : దేశంలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించదనే నేపంతో ఓ యువతి గొంతు కోసి చంపడమే కాక అడ్డగించిన యువతి తల్లిని కూడా గాయపర్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జైపూర్‌కి చెందిన షకీల్‌ ఖాన్‌(22) అనే వ్యక్తి సైన్‌ బోర్డ్‌ పేయింటర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతను ఖుశన్‌సీబా అనే యువతిని ప్రేమించాడు. కానీ ఆమె అతని ప్రేమను ఒప్పుకోలేదు. కొన్నేళ్ల తరువాత షకీల్‌ దుబాయి వెళ్లాడు. గత నెల 20న ఇండియాకు తిరిగి వచ్చాడు.

ఇంటికి వచ్చిన తర్వాత మరో సారి ఖుశన్‌సీబాను కలిసి తనను పెళ్లి చేసుకోవాలంటూ వేధించడం ప్రారంభించాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో ఖుశన్‌సీబాపై కక్ష్య పెంచుకున్నాడు. ఈ క్రమంలో సదరు యువతిని చంపేయాలని భావించాడు. అందులో భాగంగా షకీల్‌ తన ఇంటి నుంచి కత్తి తీసుకుని ఖుశన్‌సీబా ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో యువతి, ఆమె తల్లి మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇదే అదునుగా భావించిన షకీల్‌, ఖుశన్‌సీబాపై విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడు. కూతుర్ని కాపాడ్డానికి ప్రయత్నించిన తల్లిని కూడా గాయపర్చాడు.

ఇంతలో ఇంటికి వచ్చిన సోదరుడు జరిగిన దారుణాన్ని గమనించి ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేశాడు. సోదరున్ని చూసి పారి పోతున్న షకీల్‌ని పట్టుకోవడానికి కొందరు యువకులు ప్రయత్నించారు. కానీ తప్పించుకున్నాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం షకీల్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దుబాయి నుంచి వచ్చిన షకీల్‌, ఖుశన్‌సిబాని తప్పక వివాహం చేసుకోవాలనే నిర్ణయించుకున్నాడని.. అందుకే ముందే ఆమె పేరు మీద ముందే దుబాయికి ఫ్లైట్‌ టికెట్‌ కూడా బుక్‌ చేశాడని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు