నియమం పేరుతో కోడలిపై మామ అత్యాచారం..

3 Sep, 2018 09:56 IST|Sakshi

లక్నో: నిఖా హలాల పేరుతో అత్యాచారానికి పాల్పడుతున్న ఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ నియమం పేరుతో తమ జీవితాలతో ఆడుకుంటున్నారని ఎంతో మంది ముస్లిం మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నిఖా హలాల పేరుతో కోడలిపై సొంత మావయ్యే అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది.  
 
సొంత మావయ్యతో పాటు మరో నలుగురు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని యూపీకి చెందిన ఓ ముస్లిం మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొరదాబాద్‌ జిల్లాకి చెందిన ఓ మహిళకి 2014 డిసెంబర్‌లో వివాహం అయింది. పెళ్లి అయిన కొద్ది రోజులకే అత్తమామల వేధింపులు మొదయ్యాయి. 2015 డిసెంబర్‌లో ఆమెను ఇంటి నుంచి గెంటేశారు. దీంతో ఆమె తనను వేధిస్తున్నారంటూ భర్తతో పాటు అత్తమామలపై కేసు పెట్టారు. కొద్ది రోజులకి పెద్దలతో ఒప్పందం కుదుర్చుకొని మళ్లీ ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. దీంతో సదరు మహిళ కేసు వాపసు తీసుకున్నారు. అంతా సుఖాంతం అయిందన్న వేళ భర్త నిఖాహలాలను ముందుకు తీసుకొచ్చాడు. మనకు విడాకులయ్యాయని, ఆచారం ప్రకారం మరో పెళ్లి చేసుకోవాలని మహిళను సూచించాడు. మావయ్యతో కాపురం చెయ్యాలని  వేధించాడు. 

గదిలో బంధించి...
మామయ్యతో పెళ్లికి నిరాకరించిన ఆ మహిళను భర్త గదిలో బంధించారు. నియమం పేరుతో కోడలిపై అత్యాచారానికి పాల్పడిన మావయ్య మరుసటి రోజు విడాకులిచ్చారు. అనంతరం భర్త బంధువులైన మరో ముగ్గురు కూడా అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో గర్భం దాల్చిన సదరు మహిళ 2017లో బాబుకు జన్మనిచ్చింది. నిఖా హలాల పేరుతో అత్యాచారం చేసిన అత్తింటి వారిపై మహిళ ఆదివారం మొరదాబాద్‌ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనకు, తన కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరిస్తున్నారని మహిళ వాపోయారు. సామూహిక అత్యాచారం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నిఖా హలాల్‌...
ఇస్లాం నియమాల ప్రకారం విడాకులు పొందిన స్త్రీ, తిరిగి తన మాజీ భర్తను మళ్లీ వివాహం చేసుకోవాలంటే ముందు ఆమె మరో వ్యక్తిని వివాహం చేసుకోవాలి. తర్వాత ఆ భర్తకు విడాకులైన ఇవ్వాలి, లేదా అతను మరణించేంత వరకూ ఎదురు చూడాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగితేనే ఆ జంట మళ్లీ కలిసుండటానికి ఇస్లాం ఒప్పుకుంటుంది. 

>
మరిన్ని వార్తలు